భద్రతా వైఫల్యం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై కారంపొడితో దాడి
ఢిల్లీ: ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని సెక్రటేరియట్లో సీఎం కార్యాలయం బయట చోటుచేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని అనిల్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరవింద్ కేజ్రీవాల్ తన కార్యాలయంలో సమావేశాలు ముగించుకుని భోజనం చేసేందుకు మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో అనిల్ ఆయనపై దాడి చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ పాదాలకు ముక్కుతున్నట్లుగా నటించిన అనిల్ ఆ వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కారంపొడితో కేజ్రీవాల్ ముఖంపై విసిరారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వెంటనే పోలీసులు అనిల్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి సీఎం ఆఫీసులోకి కారంపొడి ఎలా తీసుకురాగలిగాడని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించారు.
Anil Kumar (pic 1) came to meet Delhi CM Arvind Kejriwal in the Secretariat to share his grievances.He handed a note to the CM & touched his feet, and chilli powder fell down from his hand (pic 2).Probe underway whether it was an attack or powder fell unintentionally:Delhi Police pic.twitter.com/IpoM73OtCh
— ANI (@ANI) November 20, 2018
ఢిల్లీ పోలీసులు తమ విధులు నిర్వర్తించడంలో వరసగా విఫలమవుతున్నారని అల్కా లాంబా ధ్వజమెత్తారు. కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు నడుచుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అనిల్ జేబులో నుంచి కింద పడిన కారంపొడి తిరిగి కేజ్రీవాల్ ముఖంపైకి ఎలా వెళుతుంది ఎన్సీపీ నేత అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జరిగిన ఘటనపై ఢిల్లీ బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి ఘటనలను సహించరాదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి అన్నారు. వెంటనే విచారణకు ఆయన డిమాండ్ చేశారు.