మోడీతో సీఎం అమీతుమీ - మిషన్ మిస్డ్ కాల్: ఆ మొబైల్ నంబర్తో చెక్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అగ్ర నాయకుల నివాసాలపై దాడులకు దిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సోదాలను నిర్వహిస్తోన్నారు సీబీఐ అధికారులు. ఆయనతో పాటు ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాలతో పాటు ఏడు రాష్ట్రాల్లో దాడులు చేపట్టారు.
సీబీఐ దాడుల వెనుక..
ఈ దాడుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని, ఈ దాడుల పట్ల భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సీబీఐని తాము అడ్డుకోలేమని స్పష్టం చేశారు. పైనుంచి వస్తోన్న ఒత్తిళ్లు, ఆదేశాల వల్లే సీబీఐ అధికారులు ఈ దాడులు సాగిస్తోన్నారనేది స్పష్టమౌతోందని వ్యాఖ్యానించారు.
అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు?
ఒక మిషన్ను చేపట్టినప్పుడు ఇలాంటివెన్నో అడ్డంకులు వస్తోంటాయని, వాటిని అధిగమిస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఎవరు సృష్టిస్తోన్నారనేది దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ సీబీఐ దాడుల వెనుక కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి ఏర్పడి తీరుతుందని అన్నారు.
మనీష్ సహా..
తన మంత్రివర్గ సహచరుడు మనీష్ సిసోడియాపై ఏడు సంవత్సరాలుగా దాడులు సాగుతూనే ఉన్నాయని, ఎందులోనూ ఆయనను కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇరికించలేకపోయారని చెప్పారు. ఎన్నో అబద్ధపు కేసులను బనాయించారని, ఏ ఒక్క దాంట్లోనూ సిసోడియా ప్రమేయం ఉన్నట్లు నిరూపించలేకపోయారని అన్నారు. తన మీద కూడా దాడులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అత్యుత్తమ విద్యాశాఖ మంత్రిగా..
తనతో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్పై ఎన్ని దాడులు చేసినా.. తమ తప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిరూపించలేక చేతులెత్తేసిందని కేజ్రీవాల్ చెప్పారు. మద్యం పాలసీ ఆధారంగా ఇప్పుడు తాజాగా సీబీఐ దాడులు కూడా ఇలాంటివేనని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మంత్రిగా మనీష్ సిసోడియా గుర్తింపు పొందారని, ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆయనపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించిందని గుర్తు చేశారు.
మిషన్ మిస్డ్ కాల్..
అందుకే ఆయనకు గిఫ్ట్గా బీజేపీ నాయకులు సీబీఐ దాడులను ఇచ్చారని చురకలు అంటించారు. విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన మంత్రిగా ది న్యూయార్క్ టైమ్స్ కథనం సిసోడియాను ప్రశంసించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశం ఇప్పుడు ఏకం కావాల్సిన అవసరం ఉందని, దీనికోసం తాను నేషనల్ మిషన్ను ప్రారంభించబోతోన్నానని అన్నారు. ప్రపంచంలోనే దేశం అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశించే వారు 9510001000 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.