ఢిల్లీని వణికిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ : 17,335 కొత్తకేసులు, 17శాతానికి పైగా పాజిటివిటీ రేటు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాస్తున్న పరిస్థితులకు ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు దేశం అంతా వణికిపోతుంది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 17,335 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసులు శుక్రవారం 15 శాతం పెరిగాయి. దేశ రాజధానిలో గత 24 గంటల్లో తొమ్మిది మంది మరణించారు. ఢిల్లీ యొక్క పాజిటివిటీ రేటు - ప్రతి 100 పరీక్షలకు పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల సంఖ్య - కేసుల తాజా చేరికతో 17.73 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 97,762 పరీక్షలు నిర్వహించారు.
ఢిల్లీలో కరోనా కేసుల ఉప్పెన.. 17 వేలను దాటిన తాజా కరోనా కేసులు
నగరం గత వారం రోజులుగా కేసుల ఉప్పెనను చూస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా కరోనా కేసుల పెరుగుదల చోటు చేసుకుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ, భారతదేశంలో ఆధిపత్య వేరియంట్ గా మారుతోంది. అంతకుముందు రోజు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం ఢిల్లీలో 17,000 కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఢిల్లీలో సానుకూలత రేటు 17 శాతానికి పెరుగుతుందని జైన్ చెప్పారు. ఆయన చెప్పినట్టే శుక్రవారం పరిస్థితి కనిపించింది.
శుక్రవారం నాటికి 1,390 మంది ఆస్పత్రులలో చేరిక.. వారంలో 462 శాతం చేరికల పెరుగుదల
ఆసుపత్రులలో చేరడం, కేసుల పెరుగుదలకు అనుగుణంగా లేనప్పటికీ, మంత్రి కేసుల పెరుగుదలపై వ్యాఖ్యలు చేశారు. కరోనా ఒమిక్రాన్ తేలికపాటిదని, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆసుపత్రిలో చేరినవారు చాలా తక్కువ అయినప్పటికీ దారుణ పరిస్థితులను చవి చూడకుండా జాగ్రత్తలు వహించాలని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా, ఢిల్లీలోని ఆసుపత్రులలో చేరిన రోగుల సంఖ్య జనవరి 1న 247 నుండి శుక్రవారం నాటికి 1,390కి పెరిగింది, ఇది వారంలో 462 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో వైద్య సదుపాయాల కల్పనపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఢిల్లీలో 30,000 యాక్టివ్ కేసులు
30,000 యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ, కేవలం 24 మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని డేటా సూచిస్తోంది. ఢిల్లీ నివాసితులు కోవిడ్ ప్రోటోకాల్లను అనుసరిస్తే మరియు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే, మహమ్మారి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. వారంతపు కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఢిల్లీలో కఠినమైన కరోనా ఆంక్షలు
ఇదిలా ఉంటే గురువారం, ఢిల్లీలో 15,097 కరోనావైరస్ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. గురువారం నమోదైన కేసులను చూస్తే మే 8 నుండి అత్యధికంగా కనిపిస్తుంది. అదే సమయంలో గురువారం ఆరు కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల ఉప్పెన కొనసాగుతున్నందున దేశ రాజధానిలో అనేక కోవిడ్ ఆంక్షలు విధించబడ్డాయి. ఎన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నా, ఎన్ని చర్యలు చేపడుతున్నా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో థర్డ్ వేవ్ వచ్చిందని స్పష్టం చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పదేపదే సూచిస్తున్నాయి.