గ్యాంగ్రేప్ దోషులకు మూడోసారి డెత్ వారెంట్: ఈ సారైనా: కన్నీటితో వేడుకుంటున్న తల్లి.. !
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ అయింది. నలుగురు దోషులకు వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు ఉరి తీస్తారు. ఈ మేరకు ఢిల్లీ న్యాయస్థానం సోమవారం మధ్యాహ్నం డెత్ వారెంట్ను జారీ చేసింది. నిర్బయ దోషులకు డెత్ వారెంట్ను జారీ చేయడం ఇది మూడోసారి. ఇదివరకు జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో వారిని ఉరి తీయాల్సి ఉన్నప్పటికీ.. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అది సాధ్యం కాలేదు.
అసలు నిర్భయ ఎవరు? ఢిల్లీలో ఆమెకు ఏం పని?: సీఎంఓ చుట్టూ సరికొత్త వివాదం..!
Recommended Video
మూడోసారి డెత్ వారెంట్..
నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అక్షయ్ కుమార్ ఠాకూర్, వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నారు. వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఆదేశిస్తూ ఢిల్లీ న్యాయస్థానం తాజాగా డెత్ వారెంట్ను జారీ చేసింది. దేశ రాజధానిలోని తీహార్ కేంద్ర కారాగారంలో మూడో నంబర్ జైలులో నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మేంద్ర రాణా డెత్ వారెంట్ను జారీ చేశారు.
క్షమాభిక్ష తిరస్కరించడం వల్ల జాప్యం..
నిజానికి- వారికి జనవరి 22, ఫిబ్రవరి 1వ తేదీ నాడే ఉరి తీయడానికి అవసరమైన డెత్ వారెంట్లు ఇదవరకే జారీ అయ్యాయి. దోషుల్లో ముగ్గురు దశలవారీగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు క్షమాభిక్ష పిటీషన్లను దాఖలు చేసుకోవడం, వాటిని ఆయన తోసిపుచ్చడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తరస్కరించినప్పటి నుంచీ 14 రోజుల వరకు దోషులకు ఉరిశిక్షను అమలు చేయకూడదు.ఈ నిబంధన అడ్డుగా ఉండటం వల్ల జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉరి తీయడానికి వీలు కలగలేదు. తాజాగా మరోసారి ఢిల్లీ సెషన్స్ న్యాయస్థానం డెత్ వారెంట్ను జారీ చేసింది.
ఈ సారైనా న్యాయం చేయండి..
ఇదిలావుండగా- మూడోసారి డెత్ వారెంట్ను జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేశారు. డెత్ వారెంట్ను జారీ చేయడాన్ని ఆమె స్వాగతించారు. తన కుమార్తెకు, తన కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఏడేళ్ల కాలం పాటు జాప్యం చోటు చేసుకుందని, ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. న్యాయపరమైన లొసుగులను అడ్డుగా పెట్టుకుని ఆ నలుగురు కామాంధులు రెండుసార్లు ఉరికంబం ఎక్కడాన్ని తప్పించుకున్నారని, ఈ సారైనా వారికి విధించిన ఉరిశిక్షను అమలు చేస్తారని భావిస్తున్నానని అన్నారు.