ఢిల్లీలో కరోనామరణ మృదంగం- శ్మశానాల్లో రద్దీ రెట్టింపు- కేజ్రివాల్ అత్యవసర భేటీ
దేశ రాజధాని డిల్లీలో కరోనా మరణ మృదంగం సాగుతోంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న కొత్త కరోనా కేసులు, సౌకర్యాల లేమితో జనం అల్లాడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇందుకు తగినట్లుగా శ్మశాన వాటికలు, సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంత్యక్రియలకు కూడా కష్టమైపోతోంది.
గతంలో ఢిల్లీలోని ఒక్కో స్మశానంలో రోజుకు దాదాపు 15 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగేవి. ఇప్పుడు అది రెట్టింపయింది. రోజుకు 30 భౌతిక కాయాలకు పైగా వచ్చేస్తున్నాయి. దీంతో అక్కడి సదుపాయాలు ఏమాత్రం సరిపోవడం లేదు. అదీ కోవిడ్ మృతదేహాలు కావడంతో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఢిల్లీలోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన నిగమ్ బోధ్ ఘాట్లో అంత్యక్రియల కోసం మొత్తం 22 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆరు సీఎన్జీ ఫర్నేస్లు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం కరోనా మృతుల కోసమే వాడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కనీసం 70 మంది ఉద్యోగులు అంత్యక్రియల సందర్బంగా ఇబ్బందులు తలెత్తకుండా శ్రమిస్తున్నారు.
ఢిల్లీలో ఈ నెలలో తొలి 13 రోజుల్లో 409 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్ కారణంగా రాజధానిలో 57 మంది చనిపోగా.. మార్చిలో 117 మంది చనిపోయారు. ఈ నెలలో మాత్రం ఇంత భారీ స్ధాయిలో మృతులు ఉండటం ప్రభుత్వాన్ని కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీలోని అతిపెద్ద శ్మశానాల్లో సైతం జేసీబీలతో సమాధుల తవ్వకాలు జరుగుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్..అంత్యక్రియల కోసం అనువైన స్ధలాలు కేటాయిచాలని సీఎం కేజ్రివాల్కు లేఖ రాశారు. గత 24 గంటల్లో 100 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. దీంతో పరిస్దితి సమీక్షించేందుకు కేజ్రివాల్ అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు.