ఢిల్లీ దంగల్: మద్యం, డ్రగ్స్, గన్స్...బాబోయ్ ఢిల్లీ ఎన్నికలు.. మైండ్ బ్లాక్..!
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారంకు తెరపడింది. ఇక అసలు విషయం తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మద్యం, మత్తుపదార్థాలు, తుపాకులు కూడా దర్శనమిచ్చాయి. ఇక ఇవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఊహించడం కూడా కష్టమే.
మొత్తం రూ.52.87 కోట్లు విలువ చేసే వస్తువులు స్వాధీనం
ఢిల్లీ ఎన్నికల ప్రచారంకు గురువారం సాయంత్రంతో తెరపడింది. ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా పార్టీలు నిబంధనలు ఉల్లంఘించాయని ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీల నుంచి మొత్తం రూ.52.87 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో రూ.10.02 కోట్లు నగదు ఉండగా రూ.2.63 కోట్లు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ లెక్కలు వివరించింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ కూడా కలకలం రేపాయని చెప్పిన ఈసీ మొత్తం రూ.5.87 కోట్లు విలువ చేసే డ్రగ్స్ మరియు నార్కోటిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.
బంగారం, వెండి వస్తువులను పంచిన పార్టీలు
ఎన్నికల ప్రచారం సమయంలో బంగారం, వెండి, ఇతర విలువైన మెటల్స్ను కూడా స్వాధీనం చేసుకుంది ఈసీ. ఇందులో రూ.32.18 కోట్లు విలువ చేసే బంగారం ఉండగా.. వెండి ఇతర వస్తువులు కలిపి రూ.2.16 కోట్లు ఉందని ఈసీ తెలిపింది. ఇక వీటితో పాటు ప్రెషర్ కుక్కర్లు, చీరెలు ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీటన్నిటినీ స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాయి ఢిల్లీ పోలీస్ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎన్నికల కోడ్ జనవరి 6న అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటిపై అధికారులు దృష్టి సారించి స్వాధీనం చేసుకున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఇతర వస్తువులతో పోలిస్తే ఈ సారి 25 రెట్లు అధికంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది.
ఆయుధాల చట్టం కింద 402 ఎఫ్ఐఆర్లు నమోదు
ఇక ఈ సారి ఎన్నికల సందర్భంగా ఆయుధాల చట్టం కింద 402 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 440 మందిని అరెస్టు చేసినట్లు ఈసీ తెలింపింది. వీరంతా ఆయుధాల స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయినట్లు చెప్పారు. మీరట్ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న గన్ రాకెట్ల ముఠా ఆయుధాలను ఢిల్లీకి సప్లయ్ చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాల్లో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. సీఏఏకు నిరసనలు జరుగుతున్న వేళ ఢిల్లీలో రెండు వారాల సమయంలోనే మూడు సార్లు తుపాకులు పేలిన ఘటనలను చూశాం.
మీరట్లో అక్రమాయుధాల ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసిన పోలీసులు
జనవరి 20వ తేదీన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అక్రమంగా తయారు చేస్తున్న ఆయుధాల ఫ్యాక్టరీని ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో కనుగొన్నారు. ఫక్రుద్దీన్ అతని కుమారుడు నూర్ హసన్లను అరెస్టు చేయడంతో పాటు 60 హై క్వాలిటీ పిస్తోళ్లనే స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నాటికి అధికారులు లైసెన్స్ లేని ఆయుధాలను 494 స్వాధీనం చేసుకున్నారు. మరో 7397 లైసెన్స్ కలిగి ఉన్న తుపాకులను డిపాజిట్ చేసినట్లు సమాచారం.
ఏరులై పారిన మద్యం
ఇక మద్యం విషయానికొస్తే ఆయా పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం సరఫరా చేశారు. ముఖ్యంగా మదరాసీ కాలనీ, సంగం విహార్లలో మధ్యం ఏరులై పారినట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఉచితంగా వచ్చే వస్తువులను తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పాడు సంగం విహార్ ప్రాంతంకు చెందిన ఓటర్ పునీత్ శుక్లా. ఉచితంగా మద్యం ఇచ్చి వారు ఒక ఫోటోకూడా తీసుకున్నారని అది వారి రికార్డుల కోసమే అని పునీత్ చెప్పాడు. కానీ ఫిబ్రవరి 8న తాను ఎవరికి ఓటు వేయాలని భావిస్తే వారికే ఓటువేస్తానని చెప్పాడు.