అసెంబ్లీ వారికి.. లోక్ సభ వీరికి.. మున్సిపల్ ఎవరికి?
మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు నోటీసులు జారీకావడంపై ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పెద్దలు మద్యం కుంభకోణాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా లేదని, మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్తో దుర్గేశ్ పాఠక్కు సత్సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణకు రావాలంటూ నోటీసులు జారీచేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ సమన్లపై సిసోడియా ట్విటర్లో స్పందించారు. దిల్లీ మద్యం విధానంతో పురపాలక ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఉన్న దుర్గేశ్ పాఠక్కు ఏ సంబంధం ఉంటుంది? ఆయనకు సమన్లు అందాయి.. వారి టార్గెట్ మద్యం విధానమా? లేదంటే మున్సిపల్ ఎన్నికలా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ పురపాలక సంఘానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఆప్ తోపాటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది ఉన్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీలకు పురపాలక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈడీ కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. గతవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేయగా సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.