రెండ్రోజుల్లో నన్నూ జైల్లో వేస్తారు-మోడీ-కేజ్రివాల్ పోరు అడ్డుకునేందుకే-మనీష్ సిసోడియా ఫైర్
మద్యం స్కాం పేరుతో నిన్న తన నివాసం, ఆఫీసులపై సీబీఐ జరిపిన దాడులపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మండిపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికలు ప్రధాని మోడీ, కేజ్రీవాల్ మధ్య పోరుగా ఉండబోతున్నాయని మనీష్ సిసోడియా చెప్పారు. అందుకే కేజ్రివాల్ ను ఆపేందుకే కేంద్రం సీబీఐని వాడుకుంటోందన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా 15 మందిని నిందితులుగా గుర్తిస్తూ సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తన ఇంట్లో సోదాలు జరిపిన ఒక రోజు తర్వాత దీనిపై స్పందించిన సిసోడియా.. కేజ్రివాల్ ను అడ్డుకోవాలన్న కేంద్రం స్క్రిప్ట్ లో భాగంగానే ఇవి జరిగాయయన్నారు.
అయినా ఆరోగ్య, విద్యా మంత్రులు ఇందులో చిక్కుకోవడం యాదృచ్ఛికం కాదని, ఎందుకంటే ఆరోగ్యం, విద్యలో ఢిల్లీ మోడల్ పై ప్రపంచం చర్చించుకుంటోందన్నారు. వారు(కేంద్రం) తమ ఆరోగ్య మంత్రిని కటకటాల వెనక్కి నెట్టారని, రెండు రోజుల్లో తనను కూడా జైలులో పెడతారని సిసోడియా ఆరోపించారు.
వీటన్నంటికీ కారణమైన ఎక్సైజ్ పాలసీ దేశంలో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ ఎక్సైజ్ పాలసీ అని సిసోడియా తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ దాని అమలుకు 48 గంటల ముందు దానిలో మార్పులు చేయకపోతే ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎక్సైజ్ నుంచి 10 వేల కోట్ల ఆదాయాన్ని పొందేదని గుర్తుచేశారు. అలాగే కేజ్రీవాల్, మోడీ మధ్య వ్యత్యాసం ఏంటంటే, మంచి పని చేసే వ్యక్తుల నుండి కేజ్రీవాల్ నేర్చుకుంటారు, అయితే మోడీ జీ తన కంటే మెరుగైన పని చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఆపడానికి ప్రయత్నిస్తారని అన్నారు.