250 మంది ఎంపీలు.. 50 మందికి పైగా కేంద్రమంత్రులతో ప్రచారం: ఫిర్ భీ: అమిత్ షా అత్యవసర భేటీ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి పరాభవం తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడం.. ఆ పార్టీ నాయకుల్లో కలవరపాటుకు గురి చేస్తోంది. ఆందోళనల్లో ముంచెత్తింది. ఎంతగా అంటే- ఎగ్జిట్ పోల్స్ ఇంకా వెలువడుతుండగానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ పరిస్థితి ఏమిటనేది అంచనా వేయగలిగారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పార్లమెంట్ సభ్యులతో అత్యవసర భేటీని నిర్వహించారు.
ఈ తరహా ఫలితాలను బీజేపీ అంచనాలకు అందనివే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు కావడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మూకుమ్మడిగా తేల్చి పారేశాయి. వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వస్తుందంటూ జోస్యం చెప్పాయి. ఆమ్ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా గానీ, బీజేపీకి అనుకూలంగా గానీ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా వెలువడలేదంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏ స్థాయిలో ఏకపక్షంగా మారాయనేది స్పష్టమౌతోంది. ఈ తరహా ఫలితాలు ఉండొచ్చనే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడం బీజేపీ అంచనాలకు అందనిదే.
ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా..
నిజానికి- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు ఈ సారి పునరావృతం కాకుండా చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో.. అన్నీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల బరిలో కనిపించారు. 250 మందికి పైగా లోక్సభ, రాజ్యసభ సభ్యులను ప్రచార కార్యక్రమాలకు వినియోగించుకున్నారు.
ఏ రాష్ట్ర ప్రజలు అధికంగా ఉండే చోట.. ఆ ప్రాంత ఎంపీలకు..
ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలు. అదికంగా నివసించే చోట.. ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ప్రచారాన్ని చేపట్టారు. 50 మందికి పైగా కేంద్రమంత్రులతో ప్రచార బాధ్యతలను అప్పగించారు. హిందుత్వాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి వివాదాస్పద కార్యక్రమాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులను టార్గెట్గా చేసుకుని చెలరేగిపోయారు. ఇంతా చేసినప్పటికీ..బీజేపీ ఢిల్లీ గద్దెను అందుకోలేకపోవచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడం మింగుడు పడట్లేదని అంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ను పట్టించుకోవద్దంటూనే..
ఎగ్జిట్ పోల్స్ అనేది అంచనా వేయడానికి మాత్రమే ఉపకరిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పొచ్చు.. తప్పకపోనూ వచ్చు. ఇదివరకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. బీజేపీ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పాయి. అదే జరిగింది. ఇప్పుడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ గురించి పట్టించుకోవద్దని, నిఖార్సయిన ప్రజల తీర్పు కోసం ఎదురు చూద్దామని అమిత్ షా పార్టీ నాయకులకు సూచించారు.