ఓటమిపై బేడీ 2 రకాలుగా: షాజియా ఇల్మీపై సోషల్ మీడియాలో సెటైర్లు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఖంగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం భిన్నరీతుల్లో స్పందించారు. తొలుత పార్టీ ఓటమికి తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆ ర్వాత ఇది తన పరాజయం కాదని, తన కృషి తాను చేశానని చెప్పారు. ఇది బీజేపీకి ఓటమి అన్నారు. అలా అంటూనే.. అంచనాలకు అనుగుణంగా పని చేయలేకపోయామని అంగీకరిస్తూ, పార్టీని క్షమాపణలు అడిగారు.
ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'నేను ఓడిపోలేదు. శక్తివంచన లేకుండా కృషి చేశా. నా కృషి నేను చేయకుంటేనే అది నా ఓటమి అవుతుంది. ఒక పార్టీగా బీజేపీ ఓడిపోయింద'న్నారు.
మహిళా ఓటర్ల ప్లాన్ బెడిసి కొట్టింది!
ఢిల్లీలో నలభై శాతానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ బేడీని నిలబడం ద్వారా ఆ ఓటర్ల ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే, పలువురు మహిళా ఓటర్లను అడిగినప్పుడు... తమకు కిరణ్ బేడీ అంటే అభిమానమేనని, కానీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కేజ్రీవాల్ను ఎన్నుకుంటామని చెప్పారు.
ధైర్యంగా పోరాడారు: కిరణ్ బేడీ
కృష్ణానగర్ నియోజకవర్గంలో కిరణ్ బేడీ ధైర్యంగా పోరాడారని ఢిల్లీకి చెందిన సీనియర్ నేత, కేంద్రమంత్రి హర్షవర్ధన్ అభినందించారు. ఓటమిపాలైనా ఆమె అందరి మనస్సులు గెలిచారన్నారు. ప్రజల తీర్పుతో ఆవేదన చెందానని, అయితే తన పాత నియోజకవర్గంతోనే తాను అనుబంధం కొనసాగిస్తానని చెప్పారు.
కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలపై ట్వీట్లు
ఇటీవలి వరకు కేజ్రీవాల్ పార్టీలో ఉండి బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ, బీజేపీ నేత కిరణ్ బేడీ పైన ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి. తద్వారా వారు ట్విట్టర్కు తాత్కాలికంగా దూరం ఉండే పరిస్థితిని కల్పిస్తున్నాయని అంటున్నారు.
కొన్ని ట్వీట్లు...
'ఒక్క వైపు ఉండి గెలుపు కోసం ప్రయత్నించాలి. గెలుపు అవకాశాలు ఉన్నచోటకల్లా వెళ్లవద్దు. ఈ ఎన్నికలు కిరణ్ బేడీకి గుణపాఠం'
'షాజియా ఇల్మీ లైఫ్ బోట్ నుండి సింకింగ్ బోట్లోకి జంప్ చేశారు'