బడ్జెట్లో అలా చేస్తే- ఆదాయ పన్ను, జీఎస్టీని సగానికి తగ్గించొచ్చు
Arvind Kejriwal: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తం అయ్యాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కోటీశ్వరుల బ్యాంక్ రుణాలను మాఫీ చేస్తోందని ధ్వజమెత్తారు. దీనివల్ల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొంతమంది బిలియనీర్లపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిలియనీర్లకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల రుణాల మాఫీని నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి డిమాండ్ చేశారు కేజ్రీవాల్. అలా చేస్తే- దేశ ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తోన్న ఆదాయపు పన్ను, జీఎస్టీని సగానికి తగ్గించవచ్చని సూచించారు.
బిలియనీర్లకు బదులుగా రైతుల రుణాలు, మధ్య తరగతి కుటుంబీలు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐలను మాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. కోటీశ్వరుల రుణాల మాఫీని విజయవంతంగా అడ్డుకోగలిగితే- ప్రజలపై విదించే ఆదాయపు పన్ను, జీఎస్టీని సగానికి తగ్గించవచ్చని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మోదీకి సూచించారు.
కోటీశ్వరులకు రుణాలను ఇవ్వడం, ఆ తరువాత వాటిని మాఫీ చేయడం వెనుక అతి పెద్ద మాఫియా ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. కొంతమంది బిలియనీర్లు నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకుల నుంచి రుణాల రూపంలో కోట్లాది రూపాయలను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తోన్నారంటూ మండిపడ్డారు కేజ్రీవాల్.
అయిదు సంవత్సరాల కాలంలో మోదీ ప్రభుత్వం 400 నుంచి 500 మంది బిలియనీర్లకు చెందిన 10 లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. అదే సమయంలో భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. వంటి ఇబ్బందులతో పేద, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications