హైదరాబాద్ బిజినెస్మెన్ అభిషేక్ రావు అరెస్ట్ - ఈడీ నెక్స్ట్ టార్గెట్..?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇవ్వాళ అరెస్టుల పరంపర ఆరంభమైంది. ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇన్ని రోజుల పాటు వారు విచారణను ఎదుర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడం, ఢిల్లీ మద్యం కుంభకోణంలో వారికి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలను సేకరించినందు వల్ల అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
ఆ ఇద్దరూ- బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్. ఈ ఇద్దరినీ ఇదివరకే కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు జైలులో ఉన్నారు. కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం అందిన నేపథ్యంలో- ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. ఆర్థిక నేరాలను నివారించడానికి ఏర్పాటైన ఈ దర్యాప్తు సంస్థ- తాజాగా బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ను అరెస్ట్ చేసింది.

ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ చోటు చేసుకున్నట్లుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్లను తమ కస్టడీ అప్పగించాలంటూ ఈడీ అధికారులు ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటీషన్ను దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో- హైదరాబాద్కు చెందిన బోయిన్పల్లి అభిషేక్ దక్షిణాదికి చెందిన లిక్కర్ బరూన్తో లాబీయింగ్ నిర్వహించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయాన్ని సీబీఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ నాయర్.. మాజీ ఈవెంట్ మేనేజర్. గతంలో ఆయన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేశారు. అనంతరం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేట్ అయ్యారు. ఆ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు.
ఇదివరకు ఇదే కేసులో ప్రముఖ లిక్కర్ కంపెనీ ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహంద్రు, జనరల్ మేనేజర్ పెర్నోడ్ రికర్డ్, బినోయ్ బాబు, అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ నలుగురిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలను నిర్వహించారు. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications