Delhi unlock: అలా చేస్తే..నో థర్డ్వేవ్: కరోనాను జయించినట్టే: ఓపిగ్గా ఇంకో వారం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది ఆరోసారి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తాజాగా ఇంకోసారి లాక్డౌన్ పొడిగించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను కొనసాగింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్లాక్ పైనా ఆయన శుభవార్త వినిపించారు. కేసులు గనక తగ్గితే 31వ తేదీ నుంచే అన్లాక్ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు.

కఠినంగా లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం..
లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన మూడోవారం నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇదివరకటితో పోల్చుకుంటే- పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు 35 శాతం మేర రికార్డవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు..తొలుత 23 శాతానికి తగ్గింది.
అక్కడి నుంచి మళ్లీ 11 శాతానికి దిగజారింది. ఈ వారం రోజుల వ్యవధిలో మరింత క్షీణించింది. 2.5 శాతం మేర మాత్రమే కరోనా పాజిటివిటీ రేటు నమోదైందక్కడ. ఢిల్లీ వైద్యాధికారులు శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. అక్కడ నమోదైన కొత్త కేసులు 2,260 మాత్రమే. ఈ మధ్యాహ్నం నాటికి 1,600 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

2.5 శాతానికి పడిపోయిన పాజిటివిటీ రేటు
సంపూర్ణ లాక్డౌన్ విధించక ముందు 25 నుంచి 30 వేల వరకు రోజువారీ కొత్త కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆ సంఖ్య 2,260కి పడిపోయింది. దీన్ని మరింత తగ్గించే ఉద్దేశంతో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించినట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.5 శాతం మేర మాత్రమే నమోదైందని కేజ్రీవాల్ తెలిపారు.
ఈ నెల 31వ తేదీ నాటికి ఈ సంఖ్యను సున్నా స్థాయికి తీసుకుని రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అందుకే- మరోసారి లాక్డౌన్ను పొడిగించినట్లు వివరించారు. ఈ వారం రోజుల్లో రోజువారీ పాజిటివ్ కేసులు మరింత తగ్గుతాయని తాను ఆశిస్తున్నానని అన్నారు.

31 నుంచే దశలవారీగా అన్లాక్..
దేవుడి దయతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత తగ్గుముఖం పడితే.. అన్లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 31వ తేదీ నుంచే దశలవారీగా అన్లాక్ ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. రోజువారీ కేసులు, పాజిటివిటీ రేటుపై అది ఆధారపడి ఉంటుందని అన్నారు.
కేసులు పెరిగితే మాత్రం మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు లేకపోలేదనే పరోక్ష సంకేతాలను ఇచ్చారాయన. ఈ వారం రోజుల పాటు ఫ్రంట్లైన్ వారియర్లకు కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ వారం అత్యంత కీలకమైనదిగా కేజ్రీవాల్ అభివర్ణించారు.

నో థర్డ్ వేవ్..
దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ను ఇవ్వగలిగితే- థర్డ్ వేవ్ ఉండబోదని కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. తమ రాష్ట్రం పరిధిలో వీలైనంత వేగంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. దీనికోసం అవసరమైన బడ్జెట్ను కూడా కేటాయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యాక్సిన్ల కోసం దేశీయ, విదేశీ టీకాల ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. తాము చేస్తోన్న ప్రయత్నాలు సఫలమౌతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా కిందటి నెల 19వ తేదీన ఢిల్లీలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications