ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజాల్ గుడ్ బై- కేజ్రీవాల్ సర్కార్ తో పోరుతోనే ?
ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వానికీ, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ కూ మధ్య జరుగుతున్న పోరులో మరో వికెట్ పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజాల్ ఇవాళ రాజీనామా సమర్పించారు. తన రాజీనామాకు రాష్ట్రపతికి పంపారు. వ్యక్తిగత కారణాలతో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
AGMUT కేడర్కు చెందిన 1969-బ్యాచ్ IAS అధికారి అయిన బైజల్.. వ్యక్తిగతకారణాలతోనే తప్పుకుంటున్నట్లు చెప్తున్నా అంతకు మించిన కారణాలు దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తన కంటే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఉన్న నజీబ్ జంగ్ నిష్క్రమించిన తర్వాత డిసెంబర్ 2016లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పలు విషయాలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో బైజాల్ కు విభేదాలు తలెత్తాయి.
బైజాల్ గతంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్గా ఢిల్లీలో పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. యుపిఎ హయాంలో, బైజల్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ను అమలు చేసిన చూపారు. ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంతేకాదు ఆఈయన గతంలో ప్రసార భారతి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, గోవా డెవలప్మెంట్ కమీషనర్గా, 37 సంవత్సరాల కెరీర్లో నేపాల్లో భారతదేశ సహాయ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు మోడీ సర్కార్ బైజాల్ ను ఆయుధంగా వాడటం మొదలుపెట్టాక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆరేళ్లుగా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు కేజ్రివాల్ ను చికాకు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వరకూ పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి పార్లమెంటులో సైతం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు పెంచుతూ కేంద్రం చట్టమే చేసింది. అయినా కేజ్రీవాల్ సర్కార్ తో పోరులో బైజాల్ తప్పుకోక తప్పలేదు.