ఓపెన్ డోర్లతో నడిచిన ఢిల్లీ మెట్రో రైలు: సస్పెన్షన్
న్యూఢిల్లీ: రెండు స్టేషన్ల మధ్య వేగంగా పరుగు తీస్తున్న సమయంలో రెండు నిమిషాల పాటు ఢిల్లీ మెట్రో రైలు తలుపులు తెరిచే ఉన్నాయి. హుడా సిటీ సెంటర్, జహీంగీర్పీర్ మధ్య మెట్రో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.
మెట్రో రైలు ఎడమ పక్క అన్ని తలుపులూ రెండు నిమిషాల పాటు తెరిచే ఉన్నాయి. తెరిచిన తలుపులతోనే రైలు అర్జన్గడ్ నుంచి బయలుదేరింది. తర్వాతి స్టేషన్ ఘితోర్నికి వచ్చిన తర్వాత తలుపులు మూసేశారు.
ఆ సంఘటనపై డిఎంఆర్సి విచారణకు ఆదేశించింది. రైలు ఆపరేటర్ తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు చెప్పారని సిఎన్ఎన్ - ఐబిఎన్ రాసింది.
ప్రయాణికులు ఎవరు కూడా ఈ సంఘటనలో గాయపడలేదని తెలుస్తోంది. దానికి తోడు, రైలు షెడ్యూల్లో ఏ విధమైన తేడా రాలేదని అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.