ఢిల్లీ ముందు రెండే ఆప్షన్లు.. ఏది ఎంచుకుందాం..? కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ అలర్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని.. శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలతో అటు హిందువులకు,ఇటు ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీ వెలుపలి శక్తులే రాజధానిలో అరాచకం సృష్టించాయని అన్నారు.
Recommended Video


అల్లర్లపై కేజ్రీవాల్ కామెంట్స్
అల్లర్ల కారణంగా ప్రతీ ఒక్కరూ నష్టపోయారని కేజ్రీవాల్ అన్నారు. 20 మందికి పైగా చనిపోయారని.. అందులో హిందువులు,ముస్లింలు ఇరువురు ఉన్నారని అన్నారు. పోలీసులు కూడా చనిపోయారన్నారు. దాడుల్లో గాయపడినవారి జాబితా తన వద్ద ఉన్నారు. హిందు,ముస్లిం ఇరువర్గాలకు చెందిన గాయపడ్డారని పేర్కొన్నారు.

రెండే ఆప్షన్స్ ఉన్నాయన్న కేజ్రీవాల్
ప్రస్తుతం ఢిల్లీ ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయన్నారు కేజ్రీవాల్. అంతా కలిసి ఐక్యంగా పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఒకటైతే.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం,చంపుకోవడం మరొకటని అన్నారు. శవాల కుప్పపై ఆధునిక ఢిల్లీని నిర్మించలేమని.. ఇంతవరకు జరిగింది చాలు అని అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను,ఇళ్లను తగలబెట్టడాన్ని,అల్లర్లు సృష్టించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.

సోదరభావంతో మెలగాలన్న కేజ్రీవాల్
ఒకవేళ బయటి వ్యక్తులు ఎవరైనా తమ ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడేందుకు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. ఒకవేళ పోలీసులే అల్లరి మూకలకు సహకరిస్తున్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మీ బ్రతుకులు మా బాధ్యత అని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఢిల్లీ ప్రజలు ప్రేమపూర్వక వాతావరణంలో జీవించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతీ మతం ఇతర మతాల పట్ల సోదరభావంతో మెలగాలన్నారు. పిల్లలను సరైన పద్దతిలో పెంచాలని సూచించారు.

ఈశాన్య ఢిల్లీలో పర్యటన
అల్లర్లలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబాన్ని అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.1కోటి పరిహారాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఆయన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్,శివ్ విహార్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications