దేశ రాజధాని ఢిల్లీ టార్గెట్ గా ఉగ్ర కుట్ర .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక .. హై అలెర్ట్
భారతదేశానికి మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే భారతదేశం ఒకపక్క చైనా విషయంలో తగిన బుద్ధి చెప్పాలని అడుగులు వేస్తుంటే, మరోపక్క ఇండియాపై ఉగ్రపంజా విసరనుంది అన్న వార్త ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. దేశ రాజధానికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ విధించారు.

ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు
ఒకపక్క సరిహద్దు ఉద్రిక్తతలు, మరోపక్క ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసులు, ఇంకొక పక్క ఉగ్రవాదులతో పొంచి ఉన్న ప్రమాదం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే అదునుగా ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు.

భారీ బందోబస్తు ... హై అలెర్ట్
మార్కెట్లు, ఆసుపత్రులు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధానమైన ల్యాండ్ మార్క్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇక క్రైమ్ ప్రత్యేక విభాగం తో పాటుగా, అన్ని జిల్లాల ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క కాశ్మీర్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడిన సమాచారంతో జమ్మూకాశ్మీర్లో అడుగడుగు గాలిస్తున్నారు ఆర్మీ, సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు జమ్ము కాశ్మీర్ పోలీసులు. ఇక ఈ సమయంలో ఢిల్లీ టార్గెట్ గా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు అని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

చైనాతో టెన్షన్ తమకు అనుకూలంగా మార్చుకునే యత్నం
భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, గాల్వాన్ లోయ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీంతో నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదుల టీం ఢిల్లీలో ట్రక్కులో ప్రవేశించే అవకాశం ఉందని, ఢిల్లీ పై ఎటాక్ చేయడానికి వారు స్కెచ్ వేస్తున్నారని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అడుగడుగున జల్లెడ పడుతూ, గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

ఒక పక్క చైనాతో, మరో పక్క ఉగ్రవాదులతో భారత్ పోరాటం
ఇక ఇదే సమయంలో అటు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోనూ, కుల్గాం జిల్లాలోనూ జరిగిన ఎన్కౌంటర్ లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు వార్తల నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చైనా విషయంలో కూడా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . తాజాగా చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంట పహారా కాస్తున్న సైనికులు వ్యవహరించాల్సిన తీరుపై గతంలో ఉన్న రూల్స్లో మార్పులు చేసింది. చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంట అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు తుపాకులకు పని చెప్పొచ్చని నిబంధనల్లో సడలింపు చేసినట్లు ఆర్మీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో అటు పాకిస్థాన్ నుండి, మరో పక్క ఉగ్ర మూకల నుండి దేశాన్ని రక్షిస్తుంది .












Click it and Unblock the Notifications