ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం... ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్...?
దేశ రాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన ఇద్దరు జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ సోమవారం(నవంబర్ 16) అరెస్ట్ చేసింది. సరాయ్ కాలే ప్రాంతంలో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారి నుంచి కీలక వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. పక్కా సమాచారంతో సరాయ్ కాలే ప్రాంతంలోని మిలీనియం పార్క్ వద్ద సోమవారం రాత్రి 10.15గం. సమయంలో వారి కోసం మాటు వేశారు. ఆ ఇద్దరు అక్కడికి రాగానే... వారిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఇద్దరి వద్ద నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ గన్స్,10 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఇద్దరిలో ఒకరిని జమ్మూకశ్మీర్లోని బారాముల్లాకి చెందిన చెందిన అబ్దుల్ లతీఫ్ మీర్(22),సన్నాఫ్ సనాఉల్లా మీర్గా గుర్తించారు.మరొకరిని కుప్వారా జిల్లా హట్ ముల్లాకి చెందిన ఆశ్రఫ్ కతానా,సన్నాఫ్ బషీర్ అహ్మద్గా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నారు.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Recommended Video
ఈ ఏడాది అగస్టులోనూ ఢిల్లీ పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. బుద్ద జయంతి పార్క్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన 15 కిలోల బరువైన రెండు భారీ ఐఈడీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పేలుళ్ల సూత్రధారి,ఐసిస్ ఉగ్రవాది అబు యూసుఫ్ను అరెస్ట్ చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు,మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఒంటరి తోడేలు తరహా దాడికి(Lone Wolf Attack) అతను ప్లాన్ చేసినట్లు గుర్తించారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.