బెయిల్ ఇవ్వం: పోలీసు కస్టడీకి టీటీవీ దినకరన్, బెంగళూరు, చెన్నై, కోచ్చిలో!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపణలపై అరెస్టు అయిన అన్నాడీఎంకే పార్టీ నేత టీటీవీ దినకరన్ ను బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంలో మనవి చేశారు.
ఈ కేసుకు దినకరన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు జామీను మంజూరు చెయ్యాలని టీటీవీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని పక్కా ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

దినకరన్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు. దినకరన్ కు కస్టడీకి ఇవ్వడానికి ఆయన న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇరు వర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాలుగు రోజులు దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దినకరన్ ను విచారించడానికి చెన్నై, కోచ్చి, బెంగళూరు నగరాలకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ క్రైం బ్రాంచ్ కు చెందిన ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications