క్రికెట్కు ఢిల్లీ కాలుష్యం దెబ్బ: శ్రీలంక ఫిర్యాదు, మాస్కులు ధరించి చరిత్రలో తొలిసారి!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపింది. శ్రీలంక ఆటగాళ్లు బౌలింగ్ చేయలేక ఆయాస పడుతూ ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో అంపైర్లు కలుగజేసుకుని మ్యాచ్ని కాసేపు నిలిపివేశారు.
అనంతరం ఆటగాళ్లందరికీ మాస్కులు పంపిణీ చేశారు. వాటిని ధరించిన క్రికెటర్లు తిరిగి ఆటను ప్రారంభించారు. గాలిలో తగినంత నాణ్యత కరవైందని తొలుత శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు. చర్చలు జరగడంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆట తాత్కాలికంగా నిలిచింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం
ఢిల్లీలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. ఇందుకోసమే అప్పుడప్పుడు సరి - భేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా మారుతోంది. ప్రాణవాయువులో నాణ్యత తగ్గడంతో రోజుల కొద్దీ అక్కడ పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఊపిరి తీసుకోలేకపోయిన లంక క్రికెటర్
తాజాగా భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్ట్ ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లాలో జరుగుతోంది. రెండో రోజు, ఆదివారం ఇన్నింగ్స్ 122.3వ బంతి విసిరిన తర్వాత బౌలర్ గమగె ఆయాసంతో ఆగిపోయాడు. ఫిజియో వచ్చిన తర్వాత ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించి మ్యాచ్ నిలిపివేయాల్సిందిగా కోరారు. బౌలింగ్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
మాస్కులు ధరించి ఆట
గాలిలో నాణ్యత లేదని అంపైర్లకు తెలిపారు. మాస్కులు ధరించారు. పరిస్థితిని అంపైర్లు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్కు నివేదించారు. ఆయన వైద్యుని సైతం పిలిపించారు. కోహ్లీ, చండిమాల్, అంపైర్లు సుదీర్ఘంగా చర్చించారు. ఆట కొనసాగించేందుకు కోహ్లీ ఇష్టపడగా చండిమల్ మాత్రం అయిష్టత కనబరిచారు.
క్రికెట్ చరిత్రలో ఇది తొలిసారి కావొచ్చు
కాసేపటి తర్వాత చర్చల అనంతరం ఆటగాళ్లు ఆడటానికి ఒప్పుకొన్నారు. వారు మాస్క్లు ధరించి ఫీల్డింగ్కు దిగారు. ఇలా మాస్క్లు ధరించి క్రికెట్ ఆడటం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు అంటున్నారు. బౌలర్ గమగె పరిస్థితి బాగాలేకపోవడంతో 124.3వ బంతి వేసిన తర్వాత ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు.