పోస్టాఫీసులో దోపిడీ.. భద్రతా సిబ్బందికి మత్తుమందిచ్చి.. 17 నగదు సంచులతో పరార్
ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఉన్న పోస్టాఫీసుపై ఆదివారం దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి పూట ఐదారుగురు వ్యక్తులు పోస్టాఫీసులోకి చొరబడి 17 నగదు సంచులతో ఉడాయించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఉన్న పోస్టాఫీసుపై ఆదివారం దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి పూట ఐదారుగురు వ్యక్తులు పోస్టాఫీసులోకి చొరబడి 17 నగదు సంచులతో ఉడాయించారు.
దొంగతనానికి ముందు పోస్టాఫీసు భద్రతా సిబ్బందికి దుండగలులు మత్తుమందు ఇచ్చి ఉంటారని, ఘటన జరిగిన రెండు గంటల తరువాత అంటే.. సోమవారం తెల్లవారుజామున దొంగతనం గురించి తమకు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు.
తాము పోస్టాఫీసుకు చేరుకునేసరికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు స్పృహ కోల్పోయి ఉన్నారని, ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోలేని స్థితిలో వారు ఉన్నారని, బహుశా వారికి మత్తుమందు ఇచ్చి ఉంటారని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోస్టాఫీసుకు దగ్గర్లోనే ఒక సీసీ టీవీ కెమెరా ఉంది. అయితే దీని ఫుటేజీ స్పష్టంగా లేదని, దుండగులను గుర్తుపట్టేందుకు ఈ ఆధారం సరిపోదని పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్న 32 చిన్న పోస్టాఫీసుల నుంచి తెచ్చిన నగదును ఈ పోస్టాఫీసులో భద్రపరిచినట్లు తెలుస్తోంది.
17 నగదు సంచులు మాత్రం కనిపించడం లేదని, వాటిలో ఉన్న నగదు ఎంతో ఇంకా అంచనా వేయలేదని, దుండగులు ప్రధాన ఖజానాను తెరిచినట్లయితే మరింత పెద్ద మొత్తంలో నగదు పోయి ఉండేదని పోలీసులు పేర్కొన్నారు.