ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు: రాజస్థాన్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 17,282 కరోనా కేసులు నమోదు కాగా, 104 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,438కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 50,736 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిసి సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ కూడా హాజరుకానున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు కొరతగా ఉండటంతో పలు హోటళ్లను కూడా కరోనా ఆస్పత్రులుగా మారుస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారంతా హోంక్వారంటైన్లో ఉండాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే ఆస్పత్రుల్లో చేరాలని సూచించింది. కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో వారి అంత్యక్రియలు నిర్వహించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది.
మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తోపాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం 6200 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గురువారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని రాజస్థాన్ సర్కారు పేర్కొంది. వీటితోపాటు మరిన్ని ఆంక్షలను కూడా కఠినతరం చేసింది కిరాణా దుకాణాలన్నింటినీ సాయంత్రం 5 గంటల తర్వాత మూసివేయాలని సూచించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లను పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వివాహాలను 50 మందితోనే జరుపుకోవాలని అనుమతిచ్చింది.