ఢిల్లీలో ఆగని మృత్యు ఘోష... 24గంటల్లో 348 మంది మృతి.. ఈ ఒక్క వారంలోనే 1400 పైచిలుకు మరణాలు..
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 348 మంది కరోనాకు బలైపోయారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. ఆక్సిజన్ కొరత పేషెంట్ల మరణాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లను పొరుగు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సైతం ఫిర్యాదు చేశారు.

ఆక్సిజన్ కొరతపై మోదీతో కేజ్రీవాల్...
దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(ఏప్రిల్ 22) వర్చువల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆక్సిజన్ సమస్యపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.'ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ లేనంత మాత్రాన ఇక్కడి ప్రజలకు ఇక ఆక్సిజన్ అందదా... ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లను వేరే రాష్ట్రాల్లో అడ్డుకుంటున్నారు... కేంద్ర ప్రభుత్వంలో ఎవరితో మాట్లాడితే పని జరుగుతుందో మీరైనా చెప్పండి...' అని అరవింద్ కేజ్రీవాల్ మోదీతో పేర్కొన్నారు.

ఈ ఒక్కవారంలోనే 1400 పైచిలుకు మరణాలు
ఢిల్లీలో గత కొద్దిరోజులుగా భారీ స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఒక్క వారంలోనే 1400 పైచిలుకు మంది పేషెంట్లు కరోనాతో మృతి చెందారు. సోమవారం(ఏప్రిల్ 19) 240,మంగళవారం 277,బుధవారం 249,గురువారం 306,శుక్రవారం 348 మరణాలు సంభవించాయి. ఇదే వారంలో మంగళవారం అత్యధికంగా 28,395 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇప్పటివరకూ ఇవే అత్యధికం. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 92వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆక్సిజన్,బెడ్లు,రెండెసివిర్ కొరత...
ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్ల కొరత నెలకొంది. రెండెసివిర్ యాంటీ వైరల్ డ్రగ్ కొరత కూడా ఉంది. సోషల్ మీడియాలో చాలా కుటుంబాలు సాయం కోసం ధీనంగా వేడుకుంటున్నాయి. తమవాళ్లకు ఆస్పత్రిలో బెడ్లు కావాలని లేదా ఆక్సిజన్ కావాలని... ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రధాని మోదీ ఆక్సిజన్ మాన్యుఫాక్చరర్స్ను ఆదేశించారు. అటు డీసీజీఐ అత్యవసర వినియోగం కోసం జైదుస్ క్యాడిలా అల్ఫా 2 బి,విరఫిన్ మాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి తీసుకున్నవారిలో 91.15శాతం మంది రికవరీ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ మాత్రలు తీసుకునే కోవిడ్ పేషెంట్లకు 7వ రోజు నాటికి వైరస్ నెగటివ్గా నిర్దారణ అవుతున్నట్లు తెలిపింది.

బ్రిటన్ వేరియంట్ వల్లే?
ఢిల్లీలో వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి బ్రిటన్ వేరియంటే కారణమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) అంచనా వేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఢిల్లీలో కరోనా వ్యాప్తిని అంచనా వేశారు. ఇందులో భాగంగా మార్చి 2,4 వారాల్లో ఢిల్లీలో కరోనా సోకినవారి శాంపిళ్లను పరిశీలించారు. మార్చి రెండో వారంలో పరిశీలించిన 28శాతం నమూనాల్లో యూకె వేరియంట్ బయటపడింది. చివరి వారంలో అది 50శాతానికి పెరిగింది. అటు పంజాబ్లో కూడా బ్రిటన్ వేరియంట్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకూ 15వేల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినట్లు ఎన్సీడీసీ డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications