అక్బర్ రోడ్డు పేరును రాత్రికి రాత్రే మార్చారు, విచారణ, ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రఖ్యాత అక్బర్ రోడ్డు పేరును మంగళవారం రాత్రి మార్చేశారు. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అధినేత అమిత్ షా నివాసాలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు పేరును మార్చాలనే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది.
అయితే మంగళవారం నాడు రాత్రి అక్బర్ రోడ్ పేరుతో ఉన్న రోడ్డు మార్గాన్ని సూచించే బోర్డుపై అక్బర్ బోర్డు కనిపించడకుండా మహారాణా ప్రతాప్ రోడ్డు అంటూ రాసిన పోస్టర్ అతికించారు. అక్బర్ రోడ్డు మార్గాన్ని సూచించే ప్రధాన సూచికపై పేరును మార్చి మహారాణా ప్రతాప్ రోడ్డు అని రాయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఎవరూ ఈ చర్యకు పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు. మే 9వ, తేది మేవార్ రాజ్పుత్ వీరుడు మహారాణా ప్రతాప్ జయంతి . అదే రోజున అక్బర్ రోడ్డు పేరును మహరాణా ప్రతాప్ పేరుతో మార్చడం చర్చకు దారితీస్తోంది.
అయితే అక్బర్ రోడ్డు సూచించే బోర్డుపై అంటించిన మహరాణా ప్రతాప్ రోడ్డు పోస్టర్ ను అధికారులు బుధవారం తొలగించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.