మరో స్టేట్లో వినాయక చవితి వేడుకలు రద్దు: ఇంట్లోనే..: బీజేపీ నేతలు ఏం చేస్తారో చూడాలి?
న్యూఢిల్లీ: వినాయక చవితి పండుగ నిర్వహణపై ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. పండుగ సమీపిస్తోన్న కొద్దీ భారతీయ జనతా పార్టీ నాయకులు తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు. అదే సమయంలో- అదే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో వినాయక చవితి పండుగపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తొమ్మిదిరోజుల పాటు సాగే ఈ పండుగను మూడు రోజులకు కుదించింది.
మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల: ఆరోగ్యంపై ఆరా: తుంగతుర్తి సభకు ఆహ్వానం..
మిగిలిన రాష్ట్రాల్లో..
తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ థాకరే..వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధించారు. పండుగల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేస్తోన్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో దేశం మొత్తం చవి చూసిందని, కోట్లాదిమంది ప్రజలు ఒకే చోటికి చేరుకునే వినాయక చవితి ఉత్సవాల్లో ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా.. దాని ఫలితం అంచనాలకు అందబోవనే ఆందోళనలను వారు వ్యక్తం చేశారు.
ఢిల్లీలో బ్యాన్..
తాజాగా- ఢిల్లీ కూడా ఇదే జాబితాలో చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితు్లో వినాయక చవితి పండుగను బహిరంగంగా నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వట్లేదని తేల్చి చెప్పింది. ప్రజలు ఇళ్లల్లోనే గణుషుడిని పూజించాలని, వీధుల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం, మండపాలను నెలకొల్పడం చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వైరస్ ఇంకా తొలగిపోలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించింది.
మహమ్మారి సమయంలో..
కరోనా వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా గుర్తించిందని, అది సమసిపోయినట్లు ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో వేలాదిమంది ఒకేచోట గుమికూడటం సరికాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆంక్షలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసిందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గుర్తు చేసింది. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని, ఇళ్లలోనే వినాయక చవితి పండుగలను జరుపుకోవాలని అథారిటీ అధికారులు.. తాము విడుదల చేసిన ఉత్తర్వులు, మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
మండపాలకు అనుమతి నో..
వీధుల్లో వినాయకుడి మండపాలను గానీ, టెంట్లు గానీ, ఇతర రూపాల్లో చవితి వేడుకలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వొద్దంటూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, ఇతర పాలన యంత్రాంగానికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. అలాగే- వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలు గుమికూడకుండా ఈ ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు.
Recommended Video
బీజేపీ నాయకులు ఏం చేస్తారో..
ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఏపీలో జగన్ సర్కార్ తరహాలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధించింది. వైఎస్ జగన్ ఇదివరకే చెప్పినట్టు.. ఇళ్లల్లోనే ఉత్సవాలను జరుపుకోవాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఢిల్లీ బీజేపీ నాయకులు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ నాయకులు ఏపీలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తోన్నట్టే.. అక్కడ కూడా ఈ పార్టీ నాయకులు రోడ్డెక్కుతారా? లేదా? అనేది వేచి చూడాలి.