ఆరేళ్ళ పోరాటం: బాలిక మరణానికి ఇద్దరు డాక్టర్లపై కేసు
న్యూఢిల్లీ: ఓ తండ్రి ఆరేళ్ళ పోరాటానికి న్యాయం జరిగింది. ఢిల్లీలోని ఇద్దరు ప్రైవేట్ డాక్టర్లపై ఎప్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.డాక్టర్ సునీల్ సరీన్, , డాక్టర్ వివేక్ కుమార్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. న్యూఢిల్లీలోని శ్రద్దాపూర్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఈ ఇద్దరు డాక్టర్లు విదులు నిర్వహిస్తున్నారు.
ఈ ఇద్దరు డాక్టర్లపై ఎన్డిఎంసిలో పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ చౌదరి అనే వ్యక్తి న్యాయ పోరాటం చేశారు. ఈ ఆసుపత్రిలో 2011 డిసెంబర్ 21వ, తేదిన తన 10 ఏళ్ళ కూతురుని చేర్పించారు.వైరల్ ఫీవర్తో ఆమె ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత డాక్టర్ సరీన్ అనే తన కూతురికి డెంగ్యూ వచ్చిందని చెప్పారు. ప్లేట్లెట్స్ కౌంట్ 2.1 లక్షలుగా ఉందని చెప్పారని చౌదరి గుర్తు చేసుకొన్నారు.
దీంతో ఆమెను రామ్మనోహర్లోహియా ఆసుపత్రికి తరలించినట్టు చౌదరి చెప్పారు.ఈ ఆసుపత్రిలో ఆమె ట్రీట్మెంట్ పొందుతూ మరణించిందన్నారు.
తన కూతురి మరణం విషయమై చౌదరి కేసు పెట్టారు. అయితే ఈ బాలిక మరణానికి కారణాల కోసం ఢిల్లీ పోలీసులు మెడికల్ నివేదిక కోసం ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ను సంప్రదించారు.
అయితే పిల్లల వైద్యంలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని మెడికల్ కౌన్సిల్ 2013 ఆగష్టు 22 న, నివేదిక ఇచ్చింది. తర్వాత చౌదరి కూడ ఇదే కేసు విషయమై మెడికల్ కౌన్సిల్ను ఆశ్రయించాడు. అయితే మెడికల్ కౌన్సిల్ మరోసారి గతంలో ఇచ్చిన నివేదికను సమర్ధించింది.
అయితే హస్పిట్ చార్జీలు ఇతరత్రా విషయాలపై చౌదరి ఢిల్లీ జిల్లా సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ఈ విషయమై కూడ దర్యాప్తు చేశారు. అన్ని సరైనవేనని తేల్చారు పోలీసులు
అయితే ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తన కూతురికి తప్పుడు చికిత్స అందించారని కొందరు డాక్టర్లు ఎత్తి చూపిన విషయాన్ని చౌదరి ప్రస్తావించారు.
దీంతో ఆసుపత్రిలోని ఇద్దరు డాక్టర్లపై ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు.అంతేకాదు న్యూఢిల్లీ మున్సిఫల్ కౌన్సిల్ ఈ ఆసుపత్రిని తమ మెడికల్ ప్యానెల్ నుండి పేరును తొలగించింది.అంతేకాదు బిల్లు చెల్లింపును కూడ నిలిపివేసింది.
చౌదరి క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీనితో పాటుగా సఫ్ధర్జంగ్ ఆసుపత్రితో పాటు ఎయిమ్స్లాంటి ఆసుపత్రుల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్కు ఇచ్చే ట్రీట్మెంట్ వివరాలను ఆర్టీఐ కింద సమాచారం తీసుకొని కోర్టుకు సమర్పించారు.
అయితే ఈ నివేదికలతో రీతూకు ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ను పోల్చి చూశారు. అయితే ఈ ఆసుపత్రిలో ఇచ్చిన మందులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించిన మందులను ఉపయోగించారని గుర్తించారు. దీని కారణంగానే రీతూ కిడ్నీలపై ప్రభావం చూపిందని గుర్తించారు.దీంతో రీతూ చనిపోయిందని చౌదరి చెప్పారు.