ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య: కరోనాతో పోయాడంటూ నమ్మించే యత్నం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించాడంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలైంది.

కరోనాతో మృతి చెందాడంటూ..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శరత్ దాస్(46) తన భార్య అనిత(30)తో కలిసి ఢిల్లీలోని అశోక్ విహార్లో నివాసం ఉంటున్నాడు. మే 2న శరత్ నిద్రలేవకపోవడంతో కరోనా కారణంగా మృతి చెందాడని అతని భార్య ఇరుపొరుగువారికి చెప్పింది.

స్థానికులకు అనుమానం వచ్చి..
అయితే, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని శరత్ దాస్ హఠాత్తుగా మరణించడంతో అనుమానించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి అంత్యక్రియలు ఆపివేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు.

పోలీసుల విచారణలో అసలు విషయం..
పోస్టుమార్టం నివేదికలో శరత్ దాస్ ఊపిరాడక మృతి చెందాడని తేలింది. దీంతో కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వాలంటూ పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది అనిత. తన భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

చివరకు ప్రియుడితో కలిసి హత్య చేశానంటూ..
తాను సంజయ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఆ విషయంలో తనకు, శరత్కు తరచూ గొడవ జరిగేదని పోలీసులకు అనిత తెలిపింది. ఈ క్రమంలోనే ప్రియుడు సంజయ్తో కలిసి భర్తను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అనిత పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 5980 కరోనా కేసులు నమోదు కాగా, 66 మరణాలు సంభవించాయి. 1931 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 56,561 కేసులు నమోదు కాగా, 1895 మంది మరణించారు.












Click it and Unblock the Notifications