కరోనా డెల్టా ప్లస్ కలకలం: మరో ఇద్దరు మృతి, ఏడు కొత్త కేసులు, టీకా వేసుకుంటే సేఫ్
భోపాల్: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెల్టా ప్లస్ కారణంగా ఇప్పటికే తొలి మరణం సంభవించగా.. తాజాగా మరో ఇద్దరు కూడా ఈ వేరియంట్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతులు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు తెలిపారు.
Recommended Video
కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే మరణం..
కాగా, కరోనా వ్యాక్సిన్ సింగిల్ లేదా డబుల్ డోసు తీసుకున్న ముగ్గురు ఈ వేరియంట్ బారినపడినప్పటికీ కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. మరణించిన ఇద్దరు కూడా కరోనాను ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు వెల్లడించారు. 22 ఏళ్ల యువతి, రెండేళ్ల చిన్నారి డెల్టా వేరియస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
ఎంపీలో కొత్తగా ఏడు కొత్త డెల్టా ప్లస్ కేసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మూడు కేసులు, ఉజ్జయినీలో రెండు కేసులు, రైసన్, అశోక్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. వీరందరికి కూడా గత నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ, జూన్లో ఎన్సిడిసిలో వారి నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా డెల్టా ప్లస్ వేరియంట్ అని తేలింది.
ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ డెల్టా పస్ కేసులు
కరోనా డెల్టా పస్ వేరియంట్ వెలుగుచూసిన మూడో రాష్ట్రం మధ్యప్రదేశ్ కావడం గమనార్హం. సెకండ్ వేవ్లో కేరళ, మహారాష్ట్రలో మొదటగా ఏవై.1 లేదా డెల్టా ప్లస్ స్ట్రెయిన్ వెలుగుచూసింది. ఈ వేరియంట్ బెల్టా స్ట్రెయిన్ కంటే తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఒక డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గురువారం 62 కొత్త కేసులు నమోదు కాగా, 22 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.89 లక్షలకు చేరింది. 1280 యాక్టివ్ కేసులున్నాయి.
డెల్టా ప్లస్ వేరియంట్తోనే థర్డ్ వేవ్ ముప్పు..
కరోనా డెల్టా వేరియంట్ దేశంలో సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైన విషయం తెలిసిందే. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను విస్మరించకూడదని స్పష్టం చేస్తున్నారు.
డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేయకూడదని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూడో వేవ్ ముప్పు తప్పదని హెచ్చరించింది. భారత్ తోపాటు యూఎస్, యూకే, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పొలాండ్, రష్యా, చైనా దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించారు.