Delta plus variant: ఆ ఆనందం ఆవిరి: ఆ మూడు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్: సీఎస్లకు లేఖ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసకర పరిస్థితుల్లో దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్నాయి. దీని బారిన పడిన అన్ని రాష్ట్రాలు కోలుకుంటోన్నాయి. లాక్డౌన్ నుంచి బయటపడుతోన్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందంటూ ఊపిరి పీల్చుకునే లోపే- దాని కొత్త రూపం విరుచుకు పడింది. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant) జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కంటే శక్తిమంతమైన వైరస్ మ్యూటెంట్గా భావిస్తోన్నారు దీన్ని. దేశంలో థర్డ్వేవ్ ఏర్పడటానికి ఈ మ్యూటెంట్ ప్రధాన కారణమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ప్రస్తుతం ఈ కొత్త తరహా వైరస్ మ్యూటెంట్.. మూడు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో డెల్టా ప్లస్ వేరియంట్తో కూడిన 40 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. డెల్టా ప్లస్ వేరియంట్ను కేటగిరైజ్డ్ చేసింది. దీన్ని వేరియంట్ కన్సర్న్ (Variant of Concern)గా కేటగిరీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఆ వెంటనే కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను అప్రమత్తం చేసింది. ఈ మ్యూటెంట్ తీవ్రతను వివరించింది.

అది వ్యాప్తి చెందకుండా ఉండటానికి తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వీపీ జోయ్ (కేరళ), సీతారాం కుంటే (మహారాష్ట్ర), ఇక్బాల్ సింగ్ భైంస్ (మధ్యప్రదేశ్)లకు వేర్వేరుగా లేఖలు రాశారు. దేశంలో ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయంటూ ఇన్సాకాగ్ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలను ప్రస్తావించారు.
కరోనా వైరస్తో పోల్చుకుంటే డెల్టా ప్లస్ మరింత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఊపిిరితిత్తులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఈ వేరియంట్ వల్ల శరీరంలోని మోనోక్లోనల్ యాంటీబాడీ రెస్పాన్స్ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని రాజేష్ భూషణ్.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. టెస్టింగ్-ట్రేసింగ్ వ్యవస్థను వేగవంతం చేయాలని అన్నారు. ఈ కేసులు వెలుగులోకి వచ్చిన జిల్లాల్లో కట్టడి చర్యలు చేపట్టాలని చెప్పారు.












Click it and Unblock the Notifications