రెడ్ మెర్క్యురీ: పాత టీవీలు, రేడియోలకు లక్షలు ఇస్తామంటున్నారు... ఏమిటీ బేరం
ఐదారు దశాబ్దాల కిందటి టీవీలు, రేడియోలు, ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్లకు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది.
వాటి కోసం తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్నాయి కొన్ని ముఠాలు. రూ. లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అవుతున్నాయి.
'రెడ్ మెర్క్యూరీ' అనే విలువైన మూలకం వాటిల్లో ఉందన్న ప్రచారమే దీనికి కారణం.
పాత టీవీలకు, రేడియోలకు రూ.10 లక్షలు
స్టోర్ రూముల్లోకి, అటకల మీదకు ఎప్పుడో చేరిపోయిన పాత టీవీలు, రెడియోల ధర ఇప్పుడు లక్షలు పలుకుతోందంటే వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది.
1970, 1960ల కాలం నాటి రేడియో, టీవీ, ల్యాండ్ లైన్ ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్ల తయారీలో రెడ్ మెర్క్యూరీని ఉపయోగించేవారని.... అణ్వాయుధాల తయారీకి అది అవసరమవుతోందని అయిదారు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెడ్ మెర్క్యూరీ అనే పదం జనాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ పాత వస్తువులను కొందరు ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలలో నేరుగానే అమ్మకానికి పెడుతున్నారు. వీటి ధర అమ్మకం, కొనుగోళ్లు పరంగా రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు పలుకుతోంది.
పాత టీవీలు, రేడియోలు ఉంటే మాకు అమ్మండి రూ.పది లక్షలిస్తామంటూ కొనేవాళ్లు ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలలో ఆఫర్స్ పెడుతున్నారు.
మరికొందరు పాతవస్తువులను కొనే వ్యాపారులుగా మారి వీటి కోసం వేట సాగిస్తున్నారు.
ఇంకొందరైతే అణు బాంబుల తయారీలో ఉపయోగపడే ఈ రెడ్ మెర్క్యూరీకి కోట్లలో విలువ ఉందనీ... వాటిని కొనేందుకు కొన్ని ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయంటూ దందాలు సాగిస్తున్నారు.
- ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్: ఈ అనంత విశ్వం ఏదో ఒక రోజు అంతం కాక తప్పదా...
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
మెర్క్యురీ, రెడ్ మెర్క్యురీ ఒకటేనా?
రెడ్ మెర్క్యురీ సంబంధించిన విషయాలను కెమిస్ట్రీ ప్రొఫెసర్గా 35 ఏళ్ల అనుభవం ఉన్న ఏయూ మాజీ వీసీ కె. నాగేశ్వరరావు బీబీసీకి వివరించారు.
"మెర్క్యురీ అత్యంత అరుదైన, విశిష్టమైన మూలకం. తెలుగులో పాదరసం అని పిలుస్తాం. సిన్నాబార్ అనే ఖనిజ ధాతువు నుంచి కేజీకి కేవలం 0.05 మిల్లీ గ్రాముల పాదరసం మాత్రమే లభిస్తుంది. ఆమ్లాలతో చర్య పొందకపోవడంతో పాటుగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైన లోహం మెర్క్యురీయే. అందుకే దీనికి అంత డిమాండ్. మన నిత్యజీవితంలో ఉపయోగించే వివిధ వస్తువుల తయారీలో దీన్ని వాడతారు. శరీర ఉష్ణోగ్రతను చూపే థర్మా మీటర్, వాతావరణ పీడనాన్ని కొలిచే బారో మీటర్లతో పాటు ఫ్లోరోసెంట్ దీపాల తయారీలోనూ పాదరసం వినియోగిస్తారు. కిలో మెర్క్యురీ ధర మూడు వేల రూపాయల వరకూ ఉంటుంది. కానీ, ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ఈ రెడ్ మెర్క్యురీ అనేది ప్రత్యేకంగా లేదు.
కాకపోతే మెర్క్యురీ సల్ఫైడ్ అనే సమ్మేళనం ఎరుపు రంగులో ఉండటంతో దాన్ని రెడ్ మెర్క్యురీగా వ్యవహరిస్తారే తప్ప నిజంగా ఇలాంటి మూలకం లేదు" అని నాగేశ్వరరావు చెప్పారు.
పాత టీవీలు, రేడియోల్లో దీన్ని ఉపయోగించారా?
ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్లు చేయడంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాజేశ్ బీబీసీతో మాట్లాడుతూ... "కొన్ని దశాబ్దాల కిందట వినియోగించిన సీఆర్టీ (క్యాథోడ్ రే- ట్యూబ్) మోడల్ టెలివిజన్, యాంటిక్ రేడియోల్లో రెడ్ మెర్క్యురీగా పిలిచే ద్రవం ఒక చిన్న ట్యూబ్లో ఉంటుంది.
సాధారణంగా దీన్ని ఐసీ కాయిల్ అని అంటారు. టీవీ, రేడీయోల్లో లోపలకి వచ్చే శబ్ద తరంగాల నాణ్యత తగ్గితే... తిరిగి ఆ తరంగాలు బయటకు వెళ్లేటప్పుడు నాణ్యతను పెంచడానికి ఉపయోగపడే పరికరాల్లో ఇది ఒకటి. దీని విలువ కూడా చాలా తక్కువ.
వీటిని సాధారణంగా ఆంప్లిఫ్లయింగ్ సెక్షన్ మెటిరీయల్ అంటారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో డయోడ్లను వినియోగిస్తున్నారు. ఈ డయోడ్ల విలువ నాణ్యతను బట్టి పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకూ ఉంటుంది" అని వివరించారు.
మెర్క్యూరీ అంటేనే ఎరుపు రంగు...
రెడ్ మెర్క్యురీలో అద్భుత శక్తి ఉందనే వదంతులు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి.
ఇప్పటికీ కొంతమందిలో ఆ నమ్మకం కొనసాగుతూనే ఉంది. కొందరు రెడ్ మెర్క్యురీకి రోగాలను నయం చేసే గుణం ఉందని నమ్ముతారు.
అలాగే దీనికి ఉన్న అత్యంత శక్తిమంతమైన అణు ధార్మిక శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇంకొందరు విశ్వసిస్తున్నారు.
పాత టీవీలు, రేడీయోలు, కుట్టు మిషన్లు, గబ్బిలాల గూళ్లలో రెడ్ మెర్క్యురీ లభిస్తుందంటూ యూట్యూబ్లో అనేక వీడియోలున్నాయి.
అయితే, ఈ రెడ్ మెర్క్యురీ అనేది ఒక కల్పన మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సిడ్నీలోని మాక్వైరీ విశ్వవిద్యాలయం అంత్రోపాలజీ ప్రొఫెసర్ లీసా విన్ రెడ్ మెర్క్యురీ విషయంలో తన అనుభవాలను గతంలో బీబీసీకి చెప్పారు.
"కొందరు మోసగాళ్లు అమాయకులైన ప్రజలను దోచుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని నమ్మి, అమ్మేందుకు లేదా కొనేందుకు ఎవరైనా వెళ్తే, భౌతికదాడులు చేసి వారి దగ్గరున్న విలువైన వస్తువులను లాక్కుంటారు. ఈజిప్టులో చాలా మంది అరబ్బులు రెడ్ మెర్క్యురీ ఉందనీ... అది అనేక రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈజిప్టులోని 'మమ్మీల' నోట్లో రెడ్ మెర్క్యురీని ఉంచేవారని... దానిని ఎలాగైనా పొందాలని అనేక ప్రయత్నాలు చేసేవారు. అలాగే గబ్బిలాల గూళ్లలో కూడా ఉంటుందని నమ్మి, వాటికోసం వేట సాగించేవారు. రెడ్ మెర్క్యురీకి ఆత్మలను వశం చేసుకునే శక్తి ఉందని నమ్ముతారు. ఇక 2009లో సౌదీ అరేబియాలో సింగర్ కంపెనీ కుట్టు మిషన్లో రెడ్ మెర్క్యురీ ఉంటుందనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి" అని చెప్పారు.
- హైపర్సోనిక్ స్క్రామ్జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?
- మనుషులను చంపే జంతువుల విషాలు.. ప్రాణాలూ కాపాడతాయి కూడా.. అవేమిటో తెలుసా?
అణ్వాయుధాలు చేయొచ్చని ప్రచారం
1980 దశకంలో జర్నలిస్టుగా పని చేసిన మార్క్ హిబ్స్ రెడ్ మెర్క్యూరీ గురించి మరింత సమాచారాన్ని గతంలో బీబీసీతో పంచుకున్నారు.
"అప్పట్లో (1980) ఒక న్యూక్లియర్ మెటీరియల్ను సోవియట్ ల్యాబుల్లో తయారు చేశారనే వదంతులు ఉండేవి. ప్రయోగశాలల్లో తయారైన న్యూక్లియర్ మెటీరియల్ అంటూ దానిని కొంత మంది రహస్యంగా అమ్మేవారు. అది చాలా శక్తిమంతమైనదని... దానితో అణ్వాయుధాలు తయారు చేయవచ్చునని నమ్మేవారు. దాన్నే రెడ్ మెర్క్యురీ అని పిలిచేవారు. అయితే తూర్పు యూరప్ దేశాలలో ఈ రెడ్ మెర్క్యురీ అక్రమ తరలింపులు జరిగేవి. తనిఖీల్లో భాగంగా పోలీసులకు దొరికిన ఈ పదార్థానికి ఎలాంటి ప్రత్యేకమైన శక్తులూ లేవని తేలింది. ఒక రకమైన న్యూక్లియర్ ఐసోటోప్కి రెడ్ మెర్క్యూరీ అని కోడ్ నేమ్ పెట్టి ఉండవచ్చునని రష్యన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడేవారు. అసలు రెడ్ మెర్క్యురీ ఉందా? లేదా? అనే విషయంపై విలేకరుల సమావేశాల్లో రష్యా, అమెరికా ప్రభుత్వాలను ప్రశ్నించేవాళ్లం. అయితే వారి వద్ద నుంచి అవునని కానీ, కాదని కానీ ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. దాంతో రెడ్ మెర్క్యూరీ ఉందని చాలామంది నమ్మేవారు" అని మార్క్ హిబ్స్ చెప్పారు.
మెర్క్యురీ, సల్ఫర్ కలయికతో ఏర్పడిన మెర్క్యూరీ సల్ఫైడ్ ఎర్రగా ఉండటంతో ఈ సమ్మేళనాన్నే రెడ్ మెర్క్యురీ అంటారన్నది నిపుణుల మాట.
2004లో బ్రిటన్లో, 2015లో టర్కీలో రెడ్ మెర్య్కూరికీ సంబంధించిన అరెస్టులు జరిగాయని ద న్యూయార్క్ టైమ్స్ 2015లో ఒక కథనం ప్రచురించింది.
రెడ్ ఎలా కలిసిందంటే...
యూనైటెడ్ సోవియెట్ రష్యా ఆర్మీకి రెడ్ ఆర్మీ అని పేరుండేది. ఈ ఆర్మీ ప్రయోగశాలల్లో అణ్వాయుధాల విస్ఫోటన స్థాయిని పెంచేందుకు ఒక రేడియోధార్మిక పదార్థాన్ని తయారు చేసేవారనే ప్రచారం జరిగేది. రష్యా ఆర్మీ తయారు చేసింది కావడంతో దీనికి రెడ్ మెర్క్యూరీ అనే పేరు వచ్చిందని అనేవారు..
ప్రస్తుతం పాత టీవీలు, రేడియోల్లో సిగ్నల్ ఆంప్లిఫైయింగ్ కోసం ఉపయోగించే ద్రవం ఎరుపురంగులో ఉండడంతో దాన్నే రెడ్ మెర్క్యురీగా ప్రచారం చేస్తున్నారు. 2015లో కర్నాటక, 2020 జనవరిలో తమిళనాడులో రెడ్ మెర్క్యురీ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలు కేవలం ఎరుపు రంగు కలిపిన మెర్క్యురీ , మెర్క్యురీ ఆక్సైడ్, డైయాక్సైడ్లు మాత్రమే. నిజానికి మెర్క్యురీతో సంయోగం పొందే ఏ పదార్థమైనా సాధారణంగా ఎరుపు రంగులోనే ఉంటుంది. దీనికి కారణం మెర్క్యురీలో వర్మిలియాన్ అనే వర్ణ ద్రవ్యం ఉండటమే.
1994లో జర్మనీ పోలీసులు కొందరు వ్యక్తుల నుంచి రేడియో ధార్మికత కలిగిన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారని... అందులో 61 శాతం మెర్క్యురీ, 11 శాతం అంటీమోనీ, 10 శాతం ప్లూటోనియం, 6 శాతం ఆక్సిజన్, 2 శాతం అయోడిన్, 1.6 శాతం గాలియంతో పాటు కొన్ని గాజు ముక్కలు ఉన్నాయని... దీన్ని రెడ్ మెర్క్యురీగా చెప్పారని అప్పటి మీడియా పేర్కొంది. 2004లో బ్రిటన్ పోలీసులు కూడా అక్రమంగా రవాణా అవుతున్న రేడియో ధార్మిక పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారుని... దాన్ని కూడా రెడ్ మెర్క్యురీగానే మీడియా తెలిపింది.
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
అద్భుత మహిమలున్నాయని అపోహలు
రెడ్ మెర్క్యురీతో గుప్త నిధుల ఆచూకీ కనుక్కోవడం, దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయడం సాధ్యమనే ప్రచారాన్ని చాలా మంది నమ్ముతున్నారు. చివరకు కోవిడ్-19కి కూడా ఇదే మందని... కోవిడ్ని ఈ రెడ్ మెర్క్యురీ పూర్తిగా తగ్గిస్తుందని వదంతులు ఉన్నాయి.
పాత టీవీలు, కెమెరాలు, రేడియోలు కావాలంటూ ప్రతి రోజూ ఫోన్లు వస్తున్నాయని టీవీ మెకానిక్ నాగరాజు తెలిపారు. 50, 60 ఏళ్ల కిందటి టీవీలను తాను చూడలేదని చెబుతున్నప్పటీకి... ఎక్కడైనా ఉంటే సమాచారమైనా ఇవ్వమంటున్నారని ఆయన తెలిపారు.
అయితే వాల్వ్ టీవీలు, వాల్వ్ రేడియోలుగా పిలిచే ఇవి ఇప్పుడు దొరకడం దాదాపు అసాధ్యమని ఆయన అంటున్నారు. రెడ్ మెర్క్యురీ కానీ... మరే ఇతర ఖరీదైన పదార్థాన్నైనా కెమెరాలు, టీవీల్లో వాడతారని చెప్పడం కేవలం జనాలని మోసం చేయడానికేనని అన్నారు.
'ఆరు మిల్లీ లీటర్లు... రూ.3 కోట్లు’
రెడ్ మెర్క్యురీతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చునని, దాని వేటలో కొంత డబ్బుని ఖర్చు చేసి చివరకు బాధితుడిగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.
"టీవీలు, ఫోన్లు, రేడియోల్లో ఉండే ఐసీ కాయిల్స్ బయట పది రూపాయలకే దొరుకుతాయి. వాటిలో గోళ్ల రంగు, కొన్ని రకాలైన (నవరత్న)నూనెలను వేసి పాత రేడియోలు, టీవీల్లోని ఐసీ కాయిల్స్లో అమరుస్తారు. ఆ ఐసీ కాయిల్స్నే రెడ్ మెర్క్యురీ ట్యూబ్స్ అంటూ నమ్మించి వాటిని అమ్మకానికి పెడతారు. నిజానికి అదంతా ఒక డ్రామా. ముందు రెడ్ మెర్క్యురీకి ఒరిజినాలిటీ పరీక్షలు కూడా చేసి చూపిస్తారని... వెల్లులి, బంగారు అభరణాలను రెడ్ మెర్క్యురీ ఉన్న ట్యూబ్ వద్దకు తీసుకుని వెళ్లగానే అది వికర్షించడం లేదా రెడ్ మెర్క్యురీ వెలిగేటట్లుగా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు. వెల్లులి, బంగారం, అద్దం పరీక్షలు చేసి అది అసలైన రెడ్ మెర్క్యురీ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, నాకు అనుమానం రావడంతో మోసం చేస్తున్నారని తెలిసింది. ఐసీ కాయిల్స్లో గరిష్ఠంగా ఆరు, ఏడు మిల్లీ లీటర్లకు మించి ద్రావణాన్ని (రెడ్ మెర్క్యురీ ) నింపలేం... ఆ ద్రావణానికే సుమారు మూడు కోట్ల రూపాయిల ధర పలుకుతుందని అనడం ఆశ్యర్యం కలిగించింది. అసలు ఆ ద్రావణాన్ని ఎవరు తీసుకుంటారో, ఆ డబ్బు ఎవరు ఎవరికి ఇస్తారో... ఇలాంటి విషయాలు కూడా కనీసం ఎవరికీ తెలియవు. కానీ ఆ ద్రావణం ఉంటే కోట్లే అంటూ ఒకరి నుంచి మరొకరికి సమాచారం చాలా వేగంగా వెళ్తూ... రెడ్ మెర్క్యురీ కోసం వెతుకుతున్నారు" అని చెప్పారు.
- ఖనానీ.. దావూద్ ఇబ్రహీం నుంచి అల్ ఖైదా, జైషే మహమ్మద్ వరకు అందరి లావాదేవీలు నడిపిన పాకిస్తానీ
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
ఇలా మోసం చేస్తారు
రెడ్ మెర్క్యురీ పేరుతో మోసం ఏ విధంగా జరుగుతుందో కూడా ఆయన చెప్పారు. తాను మూడు నెలల పాటు తిరిగిన తర్వాత ఆ విషయాలు తెలుసుకున్నానని వివరించారు.
"ముందుగా ఎవరి దగ్గరైనా పాత టీవీలు, రేడియోలు, ఫోన్లు ఉన్నాయని తెలిస్తే చాలు... మధ్యవర్తులమంటూ కొందరు వస్తారు. ఒక ఏజెన్సీ తరుపున వచ్చామని... మీ వద్ద ఉన్న వస్తువుల్లో మాకు కావాల్సిన రెడ్ మెర్క్యురీ ఉండే డీల్ ఓకే చేస్తామని చెప్తారు. తమకు ఈ పని చేయమని ఒక పెద్ద ఏజెన్సీ అగ్రిమెంట్ ఇచ్చిందని... డీల్ ఓకే అయితే ఏజెన్సీ వాళ్లతో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తామని నమ్మిస్తారు. దానికి ఓకే అంటే వెంటనే మధ్యవర్తులు టీవీలు, రేడియోలు ఉన్న వాళ్ల ఇంటికి వచ్చి ఆ పరికరాలను విప్పి... తమకి కావలసిని రెడ్ మెర్క్యూరీ ఉందా లేదా అని చూసినట్లు నటిస్తారు. ఇదంతా సాక్ష్యంగా వీడియో తీస్తారు. ఆ వీడియో తేదీని నిర్ధరించేందుకు అన్నట్లుగా ఆ రోజు ప్రచురించిన ఏదైనా న్యూస్ పేపర్ని పక్కన పెట్టి దానిపై తేదీని చిత్రీకరించడం, లేదా ఫోటోలు తీసి పంపడం చేస్తారు. వారికి కావలసిన రెడ్ మెర్య్యూరీ ఉందని... (ఉన్నా, లేకున్నా) డీల్ ఓకే చేస్తారు. మేం చెప్పినప్పుడు ఫలానా చోటుకి వస్తే దాన్ని కొనేవాళ్లని తీసుకుని వస్తామని... వచ్చినప్పుడు మధ్యవర్తితం చేసినందుకు కొంత సొమ్ము కావాలని డీల్ కుదుర్చుకుంటారు. అలాగే తమ వద్ద రెడ్ మెర్య్యూరీ ఉందని... కావలసిన వారు సంప్రదించవచ్చునంటూ మరి కొందరితో ప్రచారం చేస్తారు. టీవీలు, రేడియోల నుంచి రెడ్ మెర్క్యూరీని తీస్తున్నట్లు తాము షూట్ చేసిన వీడియోలు ఆసక్తి ఉన్నవారికి పంపిస్తారు. వారితోనూ రెడ్ మెర్క్యురీ అమ్మేందుకు డీల్ కుదుర్చుకుంటారు" అని వివరించారు.
"ఆ తరువాత అసలైన డ్రామా మొదలవుతుంది. కొనేవాళ్లని, అమ్మేవాళ్లని ఒక చోటుకి రావాలని చెప్పి... వారిద్దరి నుంచీ కమీషనంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తారు. కమీషన్ తీసుకున్న గ్యాంగ్ మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏజెన్సీ మనుషులమంటూ మరి కొందరు వచ్చి మెల్లగా మాటల్లోకి దించుతారు. ఇంతలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న నకిలీ పోలీసులు అక్కడికి వచ్చి... రెడ్ మెర్క్యూరీ అక్రమ అమ్మకాలు, కొనుగోళ్లు అంటూ హడావిడి చేస్తారు. అందర్నీ ప్రశ్నిస్తున్నట్లు నటిస్తూ అక్కడికి వచ్చిన వాళ్ల దగ్గరున్న విలువైన వస్తువులనూ డబ్బునూ తీసుకుంటారు. అనంతరం ఏజెన్సీ మనుషలమని వచ్చిన వాళ్లను నకిలీ పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని... వీళ్లను వేరే వాహనంలో అనుసరించమని చెప్పి మార్గ మధ్యంలో తప్పించుకుంటారు. ఇదంతా రెండు, మూడు గ్యాంగులు కలిపి చేస్తాయి" అని తెలిపారు.
'మోసపోకండి’
ఇలాంటి మోసాలకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని విశాఖ జోన్ -2 డీసీపీ రవి కుమార్ మూర్తిని బీబీసీతో చెప్పారు.
"కొందరు అమాయకులైన ప్రజలను మోసం చేసి దోచుకునేందుకు నేరగాళ్లు ఎప్పుడూ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతుంటారు. అయితే ఇప్పటి వరకు రెడ్ మెర్క్యూరీ తరహా మోసాలకు సంబంధించి విశాఖపట్నంలో మాకు ఫిర్యాదులు అందలేదు. కానీ పాత టీవీలు, రేడీయోలు కొంటామని, అమ్ముతామని ఎవరైనా వస్తే, వెంటనే మాకు వెంటనే సమాచారం అందించండి" అని డీసీపీ రవి కుమార్ ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)