ఆ స్కీంకు రూ.2,60,000 కోట్లు ఖర్చు: కోట్లమందికి నగదు బదిలీ: స్వేచ్ఛ..సామరస్యం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి కిందటే ఆరంభం అయ్యాయి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయ సభలు సమావేశం అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ప్రసంగిస్తోన్నారు. ఈ ప్రసంగం ముగిసిన అరగంట తరువాత కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వే నివేదిక 2022ను ప్రవేశపెడుతుంది. మంగళవారం ఉదయం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు.
ఉభయ సభలను ఉద్దేశించి- రాష్ట్రపతి చేస్తోన్న ప్రసంగంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో చోటు చేసుకున్న మార్పులను ఆయన స్పృశించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.. ఇలా ఫ్రంట్లైన్ వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై సాగిస్తోన్న పోరాటాన్ని వారు ముందుండి నడిపించారని ప్రశంసించారు.
వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏడాదికాలంలోపే 150 కోట్ల డోసులను సరఫరా చేయగలిగామని రాష్ట్రపతి అన్నారు. ఈ విషయంలో భారత్.. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తోందని అన్నారు. పేదలకు సమగ్రమైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఆయుష్మాన్ భారత్ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. జన్ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకు మందులను విక్రయిస్తున్నామని చెప్పారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం మాత్రమే కాదని, ప్రజలను గౌరవించడమే దాని మూలమంత్రమని రామ్నాథ్ కోవింద్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన ఈ ప్రాథమిక సూత్రాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సామరస్యం.. అనే మౌలిక సూత్రాల మీద తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా.. పేదలకు ప్రతినెలా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేస్తోన్నామని అన్నారు.
Recommended Video
19 నెలలుగా 80 కోట్ల మంది లబ్దిదారుల కోసం ఉచితంగా రేషన్ పంపిణీకి 2,60,000 కోట్ల రూసాయలను ఖర్చు చేశామని చెప్పారు. 44 కోట్ల మంది పేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేశామని పేర్కొన్నారు. జన్దన్-ఆధార్ కార్డు-మొబైల్ నంబర్ లింకేజ్ ద్వారా పౌర స్వయం సాధికారికతను సాధించామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తాము అమలు చేస్తోన్న పథకాల కింద కోట్లాదిమంది ప్రజలకు నగదు బదిలీ చేశామని చెప్పారు.