అక్రమ నోట్ల మార్పిడి: దేశ వ్యాప్తంగా 50బ్యాంకుల్లో ఈడీ సోదాలు, బ్యాంకర్ల అరెస్ట్
పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో నగదు జమ అయిన ఖాతాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిఘా పెట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పది బ్యాంకులకు చెందిన 50 శాఖల్లో ఈడీ బుధవారం సోదాలు చేపట్టింది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో నగదు జమ అయిన ఖాతాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిఘా పెట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పది బ్యాంకులకు చెందిన 50 శాఖల్లో ఈడీ బుధవారం సోదాలు చేపట్టింది.
బ్యాంకులు ఫెమా, పీఎంఎల్ఏ నిబంధనలు ఏమైనా ఉల్లఘించాయా? అన్న కోణంలో ఈడీ బ్యాంకు రికార్డులను పరిశీలిస్తోంది. కమీషన్కు ఆశపడి కొందరు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో పాత నోట్లను సేకరించి.. వారికి కొత్త నోట్లను అందజేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద నోట్ల తర్వాత అనుమానస్పదంగా జరిగిన లావాదేవీలన్నింటినీ పరిశీలిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు. ఈ దాడులను దేశ వ్యాప్తంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ దాడుల్లో రూ. కోటి రూపాయల విలువైన పాత పెద్ద నోట్లు(రూ.500, 1000)లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటితోపాటు రూ.20లక్షల కొత్త నోట్లను కూడా సీజ్ చేసినట్లు సమాచారం.
మనీలాండరింగ్: ఇద్దరు యాక్సిస్ అధికారుల అరెస్ట్
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమంగా పాత నోట్లను కొత్త నోట్లుగా, బంగారంగా మార్చుతున్న ఇద్దరు ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంక్ అధికారులను ఈడీ సోమవారం అరెస్ట్ చేసినట్లు ఆ బ్యాంకు వర్గాలు తెలిపాయి. 3 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ అధికారులు మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు తెలిపారు. కాగా, సదరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈడీ విచారణకు సహకరిస్తామని స్పష్టం చేసింది.