చంటిబిడ్డను వీపుకు కట్టుకుని, మరిది మృతదేహాన్ని మోసుకెళ్లిన వదిన!..
చంటిబిడ్డను వీపుకు కట్టుకుని మరిది మృతదేహాన్ని మోస్తున్న ఆమె ఫోటోలు బయటకు రావడంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.
రాంచీ: నిరుపేదల పట్ల ప్రభుత్వాసుపత్రుల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు తావిస్తూనే ఉంది. వరుసపెట్టి చోటు చేసుకుంటున్న ఘటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఒడిశాలో ఓ వ్యక్తి భార్య శవాన్ని భుజంపై 10కి.మీ మోసుకెళ్లిన ఘటన తర్వాత దేశంలో అలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి.
తాజాగా అలాంటి ఘటనే జార్ఖండ్ లోను మరొకటి చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమవాడి ప్రాణాలు పోయాయని మండిపడినందుకు.. అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో చంటిబిడ్డను వీపుకు కట్టుకుని మరిది శవాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది ఇంత దారుణంగా వ్యవహరించడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే గిరిజన యువకుడిని ఓ విషపు పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన అతని తరుపు బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఎంతగా ప్రాధేయపడ్డ లాభం లేకపోవడంతో.. మృతుడి అన్న లక్ష్మణ్, వదిన సీతాదేవిలే మృతదేహాన్ని మోసుకెళ్లారు. చంటిబిడ్డను వీపుకు కట్టుకుని మరిది మృతదేహాన్ని మోస్తున్న ఆమె ఫోటోలు బయటకు రావడంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.