ఆక్సిజన్ సప్లై కోసం రంగంలోకి వాయుసేనలు: రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మరణిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యాన్ని తగ్గించేందుకు వాయుసేనలను రంగంలోకి దించుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

ఆక్సిజన్ కొరతపై ప్రధాని దృష్టికి సీఎంలు.
కేంద్రంలో తన ఏడేళ్ల పాలనలో అత్యంత భారీ సవాలును ఎదుర్కొంటున్న ప్రధాని.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం సమావేశమయ్యారు. తాజాగా, రోజువారీ కోవిడ్ కేసులు 3.3 లక్షలను దాటిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నట్లు ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలు పీఎంకు తెలిపాయి. తమ ఆస్పత్రిలో 25 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ తెలిపారు. మరో 65 మందికి ఆక్సిజన్ అవసరమని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే పలు ఆస్పత్రులు ఆక్సిజన్ పూర్తిగా ఖాళీ అయ్యిందంటూ ప్రకటించాయి. ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలను రక్షించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలోనూ కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆక్సిజన్ సరఫరా కోసం రైళ్లు, వాసేయుసేన రంగంలోకి..
ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ప్రధానికి వివరించారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆకాశమార్గాన తరలించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆక్పిజన్ ట్యాంకర్లను ఆర్మీ బలగాలను ఎస్కార్ట్గా పంపాలని విన్నవించారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్ర బలగాలతో స్వాధీనం చేసుకోవాలని కోరారు. కాగా, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాను వేగం చేయడానికి రైల్వేలు, ఐఏఎఫ్(భారత వాయుసేన)ను రంగంలోకి దించామని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లు, ఇతర అవసరమైన ఔషధాలను బ్లాక్ మార్కెటర్ల బారినడకుండా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని కోరారు. మనమంతా కలిసి పనిచేస్తే వనరులు కొరతగా అనిపించవని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతి రాష్ట్రానికి ఆక్సిజన్.. రాష్ట్రాలు సహకరించుకోవాలి..
ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇప్పటికే కరోనా రోగుల అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతోందని చెప్పారు. ఆక్సిజన్ సరఫరా, ఇతర ఔషధాల పంపిణీ విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, తమ తమ అవసరాలను పూర్తి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలో అవసరం ఉన్న ప్రతి రాష్ట్రానికి ఆక్సిజన్ అందుతుందని ప్రధాని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఎవరూ ఆపవద్దన్నారు. ఆక్సిజన్ అవసరమున్న ఆస్పత్రులకు త్వరతగతిన ప్రాణవాయువు అందేలా ప్రతి రాష్ట్ర ఓ ఉన్నతస్థాయి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆక్సిజన్ను అవసరమున్న ఆస్పత్రులకు అందేలా ఈ కమిటీలు చూసుకోవాలన్నారు. ఆక్సిజన్ తయారీ సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచి దేశ అవసరాలున తీర్చాలని ప్రధాని కోరారు.

కరోనా టెస్టులు పెంచాలి.. ఆస్పత్రులు జాగ్రత్తలు తీసుకోవాలి..
రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను వేగంగా అందించేందుకు ఇప్పటికే కేంద్రం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరిట రైళ్లను నడుపుతోందని ప్రధాని చెప్పారు. ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను వాయుసేనలు తయారీ సంస్థల వద్దకు చేరుస్తాయని తెలిపారు. రాష్ట్రాలు కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రధాని మోడీ కోరారు. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం నుంచి 13 కోట్ల వ్యాక్సిన్లను అందించామని తెలిపారు. వర్క్ మిషన్ మోడ్లో పనిచేసి ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. నాసిక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై 24 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని.. ఈ విషయంలో ఆస్పత్రులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications