వ్యాక్సిన్ ఆన్ ది వే: కరోనా వ్యాక్సిన్ కోసం గిలియడ్ సంస్థతో హెటిరో డ్రగ్స్ ఒప్పందం
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టే ప్రక్రియలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అమెరికా ఎఫ్డీఏ రెమ్డెసివిర్ అనే వ్యాక్సిన్ను ఎమెర్జెన్సీ కింద వాడొచ్చంటూ ఆమోద ముద్ర వేసింది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమెరికాలో చాలా వరకు ఎమెర్జెన్సీ పద్ధతికింద రెమ్డెసివిర్ వ్యాక్సిన్ను కరోనావైరస్ పేషెంట్లకు ఇస్తున్నారు.
ఈ డ్రగ్ మంచి ఫలితాలను కూడా ఇస్తుందనే రిపోర్టులు వచ్చాయి. ఇప్పటికే జపాన్ కూడా ఈ డ్రగ్ను వినియోగిస్తోంది. ఈ డ్రగ్ను తయారు చేసిన గిలియాడ్ సంస్థతో భారత ఔషధ కంపెనీలు ఒప్పందం కుదర్చుకున్నాయి.
రెమ్డెసివిర్ డ్రగ్ కోసం ఈ వ్యాక్సిన్ను తయారు చేసిన గిలియడ్ సంస్థతో భారత ఫార్మా కంపెనీలు సిప్లా, జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో మరియు మైలాన్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ అగ్రీమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ మెడిసిన్ను తయారు చేయడం ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రెమ్డెసివిర్ డ్రగ్ను ఎమెర్జెన్సీ యూజ్ అథారైజేషన్ కింద వినియోగించాలని ఎఫ్డీఏ పేర్కొంది. భారత్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని సంస్థలు కూడా గిలియడ్ సంస్థతో రెమ్డెసివిర్ మెడిసిన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు గిలియడ్ సంస్థ వెల్లడించింది. 127 దేశాల్లో భారత కంపెనీలు రెమ్డెసివిర్ మెడిసిన్ను తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు గిలియడ్ సంస్థ అనుమతి ఇచ్చింది.
ఇక గిలియడ్ సంస్థ అనుమతి ఇచ్చిన దేశాలన్నీ తక్కువ ఆదాయం కలిగి ఉన్న దేశాలుండగా కొన్ని దేశాలు మాత్రం అధిక ఆదాయం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఆరోగ్యరంగం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. ఇక లైసెన్స్ పద్ధతి కింది గిలియడ్ సంస్థ నుంచి టెక్నాలజీని ఆయా దేశీయ ఫార్మా కంపెనీలు పొందుతాయి. అంటే గిలియడ్ సంస్థ ఎలాంటి ఫార్ములా వినియోగిస్తుందో అదే సమయంలో టెక్నాలజీని కూడా ఈ సంస్థలు వినియోగించుకుంటాయి. దీనివల్ల రెమ్డెసివిర్ డ్రగ్ తయారీలో వేగం పుంజుకుంటుందని గిలియడ్ సంస్థ స్పష్టం చేసింది.
ఇక ఈ మెడిసిన్కు ఆయా సంస్థలు తమ సొంత ధరను నిర్ణయించుకునే అధికారం ఉందని వెల్లడించింది. ఇక కోవిడ్-19 నుంచి ప్రపంచంకు విముక్తి కలిగిందని హెల్త్ ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించేవరకు లైసెన్స్ పరంగా రాయల్టీ ఉచితంగా ఉంటుందని లేదా మరో సంస్థ కొత్త వ్యాక్సిన్ కనుగొని దానికి ఆమోదం వచ్చే వరకు రాయల్టీ ఉచితంగా ఉంటుందని గిలియడ్ స్పష్టం చేసింది.
కోవిడ్-19తో బాధపడుతున్న వారికి త్వరతగతిని ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకే గిలియడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని సిప్లా యాజమాన్యం తెలిపింది. కావాల్సిన అనుమతులు వచ్చాక రెమ్డెసివిర్ డ్రగ్ తయారీని ప్రారంభిస్తామని జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్ సంస్థ పేర్కొంది. ఇక డ్రగ్కు కావాల్సిన క్రియాశీలక ఔషధ పదార్థాలను కూడా ఉత్పత్తి చేసేందుకు తమ సంస్థ ప్రణాళిక రచిస్తోందని జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్ సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ హెటిరో ఇప్పటికే ప్రారంభించిందని ఆ సంస్థ ఛైర్మెన్ పార్థసారథి రెడ్డి చెప్పారు. ఇందుకోసం ఐసీఎంఆర్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు.