ప్రత్యేక రాష్ట్రం, కాంగ్రెస్ ఎంఎల్ఏ పై వేటు
బెంగళూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు కర్ణాటకలోని విజయనగర జిల్లా దేవరహిప్పగి శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ ఎ.ఎస్. పాటిల్ నడహళ్ళిని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కోనసాగించారని ఆయన మీద వేటు వేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని, ఎ.ఎస్. పాటిల్ మీద చర్యలు తీసుకోవాలని కేపీసీసీ అధిష్టానికి ఫిర్యాదు చేసింది. పార్టీ నుండి బహిష్కరించాలని లేఖ వ్రాశారు.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎ.కే. ఆంటోని నేతృత్వంలోని ప్రత్యేక కమిటి ఈ విషయంపై చర్చించింది. పార్టీకి నష్టం కలిగించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, వెంటనే ఎ.ఎస్. పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కేపీసీసీకి సూచించారు.
బుధవారం కేపీసీసీ ఎ.ఎస్. పాటిల్ ను పార్టీ నుండి బహిష్కరించామని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కొన్ని నెలల క్రితం ఎ.ఎస్. పాటిల్ బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని పలువురు ఎంఎల్ఏలు అడుగుతున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అంతే కాకుండ కాంగ్రెస్ పార్టీ తీరుపై పాటిల్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లే ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.