జపాన్లో టీచర్స్ మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు: మోడీ
న్యూఢిల్లీ: విద్యార్థులతో కలిసి తాము మరుగుదొడ్లు శుభ్రం చేస్తామని జపాన్ దేశంలోని ఉపాధ్యాయులు తనకు చెప్పారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మోడీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఒక ఆడిటోరియంలో 700 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం జరిగింది. 12,500 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. కోటి 20 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యతను మరింత చాటాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచానికి మంచి ఉపాధ్యాయులు కావాలని, అది అందించే సత్తా భారత్కు ఉందన్నారు. భారత భవితకు విధాతలైన విద్యార్థులతో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు.
అన్ని భాషల్లో బోధించే ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశీలనాత్మక దృక్పథం కల్పించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ తన పుట్టిన రోజును జరుపుకోలదన్నారు. మంచి ఉపాధ్యాయులను అందించే సత్తా యువభారత్కు లేదా అని ప్రశ్నించారు.
విద్యార్థుల పైన ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయుడికి ఒకప్పుడు అత్యంత గౌరవం ఇచ్చే వారన్నారు. మన పిల్లలు ఎందుకు ఉపాధ్యాయులు కాకూడదో చెప్పాలన్నారు. వస్త్ర, కేశ అలంకరణలో ఉపాధ్యాయులను విద్యార్థులు అనుకరిస్తారన్నారు. జపాన్లాగే మన దేశంలోను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కట్టుగా పని చేసే విధానం కావాలన్నారు. కలిసి పని చేసే విషయంలో పాఠశాలల సాయం కావాలన్నారు.