ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్ - రేపు ప్రమాణంకు ఛాన్స్ : షిండే వర్గం సిద్దం - అలర్ట్..!!
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి థాక్రే రాజీనామాతో బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయటానికి అన్నట్లుగా రంగం సిద్దం అవుతోంది. ముఖ్యమంత్రి దిగిపోక తప్పదని ముందుగానే అంచనాకు వచ్చిన బీజేపీ నేతలు..థాక్రే రాజీనామా చేస్తే వెంటనే అమలు చేయాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నారు. ఇప్పుడు వీటిని ఆచరణలో పెడుతున్నారు. అందులో భాగంగా.. ఈ రోజు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపి కోర్ కమిటీ సమావేశం జరగనుంది.
ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు
ఆ సమావేశం తరువాత మీడియా సమావేశం ద్వారా తాము ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఏం చేయబోతోందీ పఢ్నవీస్ వెల్లడించే అవకాశం ఉంది. ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన ఫడ్నవీస్ పార్టీ అగ్రనాయకత్వంతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. వారి నుంచి స్పష్టమైన రూట్ మ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో షిండేతోనూ మంతనాలు జరిగాయని సమాచారం. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్ గవర్నర్ ను కోరే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. గవర్నర్ నుంచి స్పందన ఆలస్యం అయితే, తాను స్వయంగా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు పైన సంసిద్దత వ్యక్తం చేయనున్నారు.
ఫడ్నవీస్ సీఎంగా మరోసారి..
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 106 మంది సభ్యుల మద్దతు ఉంది. శివసేన కు చెందిన షిండే వర్గం 39 మంది మద్దతుగా ఉన్నారు. చిన్న పార్టీలు - ఇండిపెండెంట్స్ కలిపి 18 మంది వరకు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నారు. అటు గోవాలోని తాజ్ రిసార్ట్ లో ఉన్న షిండే క్యాంపులోని వారితో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి మంతనాలు సాగించారు. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే.. వెంటనే షిండే వర్గం మొత్తం ముంబాయి చేరుకొనే విధంగా సిద్దంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. రేపు ( జూలై 1వ తేదీ) ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో థాక్రే రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న వేళ మహారాష్ట్రలో పరిస్థితులు సున్నితంగా మారుతున్నాయి.
గవర్నర్ నిర్ణయం కోసం వెయింటింగ్ - నేడు క్లారిటీ
రెబెల్ ఎమ్మెల్యే లు ముంబై వస్తే ఎలాంటి అవాంచనీయ దాడులు జరగకుండా వుండటానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముంబాయి పోలీసు కమిషనర్ సైతం నేడు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుత కమీషనర్ సంజయ్ పాండే స్థానంలో వివేక్ ఫనసాల్కర్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక, ఇప్పుడు గవర్నర్ తీసుకొనే నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఫడ్నవీస్ మీడియా సమావేశం తరువాత మహారాష్ట్రలో పరిణామాలు - కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడనే అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.