రాజ్నాథ్ కాళ్లు పట్టుకున్న గుజరాత్ డీజీపీ!? సోషల్ మీడియాలో ఫొటో హల్ చల్..
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం ఒక ఫొటో. రాజ్నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉంటే గుజరాత్ డీజీపీ ఆయన కాళ్లు పట్టుకున్నట్లున్న ఫొటో సోషల్మీడియాలో...
ఢిల్లీ: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం ఒక ఫొటో. రాజ్నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉంటే గుజరాత్ డీజీపీ ఆయన కాళ్లు పట్టుకున్నట్లున్న ఫొటో సోషల్మీడియాలో హల్ చల్ చేసింది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్న ఆలంగిర్ రిజ్వీ అనే వ్యక్తి ఈ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. 'గుజరాత్ డీజీపీ రాజ్నాథ్ కాళ్లు పట్టుకున్నారు. ఇది చూశాక ఎన్నికలుసామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం నాకు లేదు. ఎవరిని నమ్మాలో అర్థంకావడం లేదు.' అని ట్వీట్ చేశాడు.
దాంతో ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ రాజ్నాథ్పై కామెంట్లు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఫొటో మాజీ ఐపీఎస్ అధికారి యోగేశ్ ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన 'క్యా యే సచ్ హై' అనే చిత్రంలోనిదని, ఫొటోలో ఉన్న వ్యక్తి స్థానంలో రాజ్నాథ్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి పెట్టేశారని తెలిసింది.
ఫొటోలో ఉన్న అసలు నిజం ఏంటో తెలిసిపోవడంతో నెటిజన్లు ఆలంగిర్ రిజ్వీపై మండిపడ్డారు. రాజ్నాథ్ ఫొటోను తొలగించి క్షమాపణ చెప్పాలని పలువురు జర్నలిస్ట్లు, నెటిజన్లు కోరారు. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు.
తాజాగా ఈ ఫొటో గురించి రాజ్నాథ్ మీడియా ద్వారా స్పందిస్తూ.. 'అసలు ఆ ఫొటోనే నాది కానప్పుడు డీజీపీ నా కాళ్లు ఎలా పట్టుకుంటారు? మాపై దుష్ప్రచారం చేయడానికే ఇలాంటి పనులు చేస్తుంటారు.' అని రాజ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.