డయాబెటీస్,హైపర్ టెన్షన్,గుండె వ్యాధిగ్రస్తులు.. కరోనా కాలంలో ఇవి పాటించాల్సిందే.. ఐసీఎంఆర్ కీలక సూచనలు...
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కొన్ని FAQ(తరుచు అడిగే ప్రశ్నలు)లపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇందులో డయాబెటీస్,హైపర్ టెన్షన్,గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. అలాగే కరోనా సమయంలో ఈ దీర్ఘకాలిక వ్యాధుల చుట్టూ అల్లుకున్న కొన్ని అపోహలను బద్దలుకొట్టింది.
ఐసీఎంఆర్ ప్రకారం... డయాబెటీస్,హైపర్ టెన్షన్,గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో మిగతా వారికన్నా ఎక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు వృద్ది చెందవచ్చు. అలాగే మిగతా వారి కన్నా కరోనాతో వీరిలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ వారిలో కరోనా తాలూకు స్వల్ప లక్షణాలు కనిపించినా సరే... అంతకుముందు ఆ దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకున్న మందులను ఇప్పుడు కూడా తీసుకోవాలి.
'వైద్యులు సూచిస్తే తప్ప అప్పటికే వాడుతున్న మందులను పక్కనపెట్టకండి. బీపీ,డయాబెటీస్,గుండె సంబంధిత సమస్యలకు మందులను కొనసాగించండి. అలాగే కొవ్వు నియంత్రణ కోసం వాడే మందులను కూడా కొనసాగించాల్సిందే.' అని ఐసీఎంఆర్ వెల్లడించింది.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటీస్తో బాధపడేవారికి కోవిడ్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందా అన్న ప్రశ్నకు... 'అనియంత్రిత డయాబెటీస్తో బాధపడేవారు సాధారణంగానే అన్ని ఇన్ఫెక్షన్ల బారినపడే రిస్క్ ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసు. అయితే డయాబెటీస్ ఉన్నవారు కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ కొంతమంది డయాబెటీస్ పేషెంట్లకు మాత్రం దీని రిస్క్ ఎక్కువగా ఉండవచ్చు.' అని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
డయాబెటీస్ను నియంత్రణలో ఉంచుకునేందుకు సరైన డైట్,డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలని ఐసీఎంఆర్ పేర్కొంది. అలాగే తరచూ సుగర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. డయాబెటీస్ పేషెంట్లు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు తరుచూ బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవడం,ఇన్సులిన్ ఇతరత్రా మందులను అడ్జస్ట్ చేసుకోవడం చేయాలని తెలిపింది. అలాగే కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం,తగినంత ఫ్లూయిడ్స్ తీసుకోవాలని పేర్కొంది.
ఇక బీపీ పేషెంట్ల గురించి ప్రస్తావిస్తూ...'అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత తేలిందేంటంటే... ఏసీఈ ఇన్హిబిటర్స్(eg. Ramipril, Enalapril),ఆంజియోటెన్సిన్ రెసిప్టర్ బ్లాకర్స్(ఏఆర్బీ)(eg. Losartan, Telmisartan) మందులు తీసుకునేవారికి కరోనా రిస్క్ ఎక్కువ అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.' అని స్పష్టం చేసింది. హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతూ ఈ మందులు తీసుకునేవారు కరోనా సోకిన తర్వాత వీటిని మానేస్తే మరింత అనారోగ్యానికి గురికావచ్చు. అది గుండెపై మరింత దుష్ప్రభావాన్ని చూపవచ్చు. కాబట్టి వైద్యులు సూచిస్తే తప్ప ఆ మందులను పక్కనపెట్టవద్దు.
కోవిడ్ సోకిన హార్ట్ పేషెంట్లు NSAIDs,ఇబుప్రూఫెన్ మందులను ఉపయోగించడం వారికి హాని చేస్తుందని ఐసీఎంఆర్ పేర్కొంది. అయితే వైద్యుల సూచన మేరకే వాటిని ఉపయోగించడం లేదా పక్కనపెట్టడం చేయాలని సూచించింది. పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తే అన్నింటికంటే పారాసిటమాల్ బెస్ట్ అని స్పష్టం చేసింది. దానివల్ల ఎటువంటి హాని జరగదని తెలిపింది.
డయాబెటీస్,హైపర్ టెన్షన్,గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ధూమపానం,మద్యపానం మానేయాలని సూచించింది. అలాగే బీపీ,సుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలని సూచించింది. ప్రతీరోజూ కొంత వ్యాయామం చేయాలని,సరైన డైట్ పాటించాలని సూచించింది. ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచాలని పేర్కొంది. డైట్లో ప్రొటీన్,వెజిటేబుల్స్,పండ్లు చేర్చాలని చెప్పింది.