ఇద్దరు మంత్రుల మీద వేటు వెయ్యాలని మాజీ సీఎం: అయోమయంలో ముఖ్యమంత్రి, బీజేపీ !
మైసూరులో జేడీఎస్ కార్యకర్తలు బీజేపీకి ఓటు వేశారని ఇద్దరు మంత్రులు వ్యాఖ్యానించారని సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే సిద్దరామయ్య తిరుగబడతారా అనే విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు చర్చ మొదలు పెట్టారు.
బీజేపికి చక్కటి అవకాశం
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సీట్లు పంచుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. రెండు పార్టీలు కలిస్తే బీజేపీని దెబ్బతీయ్యడానికి అవకాశం ఉంటుందని నాయకులు భావించారు. అయితే రెండు పార్టీల కార్యకర్తలు స్నేహంగా లేకపోవడంతో ఇరు పార్టీల దోస్తి దెబ్బతినిందని సమాచారం. ముఖ్యంగా మండ్య, మైసూరు, హాసన్, తుమకూరు, కోలారు జిల్లాల్లో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోవడంతో బీజేపీకి కలిసి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
మంత్రి సంచలన వ్యాఖ్యలు
మైసూరులో ఉన్నత విద్యాశాఖా మంత్రి జీటీ. దేవేగౌడ మాట్లాడుతూ జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ బీజేపీకి ఓటు వేశారని అన్నారు. మైసూరులో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి ఓడిపోతే మాకు సంబంధం లేదని మంత్రి జీటీ. దేవేగౌడ చెప్పారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో కేహెచ్. విశ్వనాథ్ ఇదే మైసూరులో ఓడిపోయారని, అప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారా అంటూ మంత్రి జీటీ. దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జరిగిపోయినదానికి చర్చ ఎందుకు ?
మంత్రి జీటీ. దేవేగౌడ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. మంత్రి మాటలు నిజయం కాకూడదని కోరుకుంటున్నానని సిద్దరామయ్య చెప్పారు. జేడీఎస్ ఓట్లు బీజేపీకి ఎందుకు పడ్డాయి, జరిగిపోయిన దానికి ఇప్పుడు చర్చ ఎందుకు అని సిద్దరామయ్య అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జేడీఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని తనకు తెలిసిందని సిద్దరామయ్య అన్నారు.
మంత్రుల మీద వేటు ?
మంత్రి జీటీ. దేవేగౌడ జేడీఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని చెప్పిన తరువాత మరోమంత్రి సా.రా. మహేష్ సైతం అవును ఇది నిజమే అని అన్నారు. చాముండేశ్వరి నియోజక వర్గంలోని ఉద్దూరులో జేడీఎస్ మద్దతుదారులు బీజేపీకి ఓటు వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, జేటీ. దేవేగౌడను మంత్రి పదవుల నుంచి తప్పించాలని సిద్దరామయ్య ఎక్కడా డిమాండ్ చెయ్యలేదని మంత్రి సా.రా, మహేష్ అన్నారు. అయితే మా మాటలతో సిద్దరామయ్య అసహనంగా ఉన్నారని తెలిసిందని మంత్రి సా.రా. మహేష్ తెలిపారు.
మండ్య లీడర్స్
సుమలత ఏర్పాటు చేసిన డిన్నర్ కు మండ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకులు హాజరు అయ్యారు. ఈ విషయంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. మండ్య జిల్లా నాయకుల మీద చర్యలు తీసుకుంటే ఇద్దరు మంత్రుల మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. మొత్తం మీద మాజీ సీఎం ఒత్తిడితో ఇద్దరు మంత్రుల మీద వేటు పడుతుందా? లేదా? అనే విషయం వేచిచూడాలి.