అజిత్ ఔట్, పన్నీరు సైలెన్స్!: శశికళ చక్రం, జయలలిత బతికే ఉంటే..?
చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళను అన్నాడీఎంకే అధినేత్రిగా చేసేందుకు పార్టీలో చాలామంది నేతలు ఉవ్వీళ్లూరుతున్నారు. ఈ నెల 29వ తేదీన ఆమెను పార్టీ చీఫ్గా ఎన్నుకోవచ్చునని, అనూహ్యంగా శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు జయలలిత.. ఎప్పుడైనా తన రాజకీయ వారసురాలిగా శశికళను వెలుగులోకి తీసుకు వచ్చారా? అనే చర్చ సాగుతోంది. దశాబ్దాల పాటు జయలలితకు అండగా ఉన్న శశికళకు రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు.
ఆశాజ్యోతిగా..
ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో ఎక్కువ మందికి శశికళను ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎక్కువ మంది నేతలు కోరుకుంటున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. జయలలిత షాడోగా ఉంటూ ఇన్నాళ్లు ఆమెతో పాటు శశికళ కూడా చక్రం తిప్పారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, చక్రం తిప్పాలని భావిస్తున్నారు.
జయలలిత బతికి ఉంటే..
శశికళ రాజకీయాల్లో ఉండాలని జయలలిత కోరుకున్నారా? తన వారసురాలిగా ఆమెను ప్రత్యక్షంగా లేక పరోక్షంగానైనా ఎంపిక చేశారా? జయలలిత బతికే ఉంటే ఆమెను రాజకీయాల్లోకి రానిచ్చేవారా? శశికళ పోటీ చేసేందుకు అంగీకరించేవారా? అనే చర్చ సాగుతోంది. జయ బతికి ఉంటే శశికళ రాజకీయ ఎంట్రీకి అవకాశవాదమే లేదని తెలిసినప్పటికీ ఆమె బతికి ఉంటే రానిచ్చే వారా అనే చర్చ సాగుతోంది.
రాజకీయ వారసురాలిగా నో!
శశికళను తన స్నేహితురాలిగా ఎప్పుడూ తన పక్కనే జయలలిత ఉంచుకున్నారు. తన వ్యక్తిగత పనుల్లో ఆమె జోక్యాన్ని ఏమాత్రం ఆపలేదు. కానీ రాజకీయ వారసురాలిగా మాత్రం శశికళను ఏమాత్రం జయలలిత కోరుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జయ ఎప్పుడు కూడా శశికళ రాజకీయ జీవితంపై మాట్లాడలేదని, ఆమెను వారసురాలిగా కోరుకోలేదని అంటున్నారు.
శశికళనే ఎందుకు కోరుకుంటున్నారు?
జయలలిత జీవించి ఉన్నప్పుటు పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో శశికళ పాత్ర కూడా ఎంతో కొంత ఉండేదని అంటున్నారు. ఆమె కేవలం యాక్టివ్ పాలిటిక్స్లో మాత్రమే లేరని చెబుతున్నారు. కానీ జయ నిర్ణయాల వెనుక శశికళ బ్రెయిన్ ఉన్నదని అంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు పార్టీకి శశికళ తప్ప మరొకరు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారని అంటున్నారు.
జయలలిత వెనుక శశికళ బ్రెయిన్
జయలలిత దాదాపు ప్రతి నిర్ణయం వెనుక శశికళ బ్రెయిన్ ఉన్నదంటున్నారు. చాలా పార్టీ నిర్ణయాలతో పాటు, ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక వంటి వాటిని కూడా శశికళ చూసేవారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళను మించిన వారు లేరని భావిస్తున్నారని అంటున్నారు.
పన్నీరుసెల్వంనే జయలలిత కోరుకున్నారా?
తన వారసులుగా పన్నీరు సెల్వంను జయలలిత కోరుకున్నారా అంటే మరికొంతమంది అవుననే అంటున్నారు. తాను చిక్కుల్లో ఉన్నప్పుడు పన్నీరుకు జయ రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ శశికళకు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. మరోవైపు నటుడు అజిత్ కూడా వారసత్వ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.