బీజేపీ నుంచి టీఎంసీ నేతల ఘర్వాపసీ- అంగీకరించని మమత-వేచి చూసే ధోరణి
పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హడావిడి చూసి టీఎంసీ నుంచి వరుసగా నేతలు ఆ పార్టీకి క్యూ కట్టారు. అయితే ఎన్నికల్లో ఎప్పుడైతే మమతా బెనర్జీ భారీ మెజారిటీతో గెలిచారో అప్పటి నుంచి బీజేపీలో చేరిన టీఎంసీ నేతలంతా పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు వారంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నాలుగు సార్లు టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికలకు ముందు బీజేపీలో ఫిరాయించిన సోనాలీ గుహా ఇప్పుడు దీదీ ప్రాపకం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేప నీళ్లను వదిలి ఎలా ఉండలేదో నేను కూడా అలాగే మిమ్మల్ని వదిలి ఉండలేనంటూ సోనాలీ ప్రాధేయపడుతున్నారు. తాను చెత్త నిర్ణయం తీసుకున్నానని, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని, తిరిగి టీఎంసీలోకి వస్తానని మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు దీపేందు బిశ్వాస్ చెప్తున్నారు. ఎంపీ ముకుల్ రాయ్ కూడా తాను తిరిగి టీఎంసీకి వెళ్లిపోతానని రోజూ అనుచరుల వద్ద చెప్తున్నారు.
వీరితో పాటు చాలా మంది బీజేపీలోకి వెళ్లిన టీఎంసీ నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం వీరి విషయంలో ఆచిచూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీరిని తిరిగి టీఎంసీలో చేర్చుకునేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల సమయంలో చూద్దామన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. అయితే టీఎంసీ వ్యూహకర్తలు మాత్రం వీరితో టచ్లో ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.