విభజన: కిరణ్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిన దిగ్విజయ్
న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఫోన్ చేశారు. తక్షణమే ఢిల్లీకి రావాల్సిందిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. విభజన తీర్మానానికి సంబంధించి ముఖ్యమంత్రికి, దిగ్విజయ్ల మధ్య వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి పంపడం లేదని, ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేసి, ముసాయిదా బిల్లును మాత్రమే శాసనసభకు పంపుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు ఫోన్ చేసి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, ఆ తర్వాత ముసాయిదా బిల్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెబుతూ వచ్చారు. అందుకు విరుద్ధంగా సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేయడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ను ఇంతకు ముందు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ తీర్మానం విషయంపై సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడుతానని దిగ్విజయ్ సింగ్ సోమవారం మధ్యప్రదేశ్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు ముందు ఏర్పడుతుందా, తర్వాత ఏర్పడుతుందా చెప్పలేమని ఎఐసిసి అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications