తీర్మానం అడ్డుకాదు, సిఎంను మార్చం: డిగ్గీ, తెరాసపై..
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ చర్చను ముగించిన ఘటనపై ఆయన గురువారం మీడియాతో ఆయన ఆ మాటలన్నారు.
తెలంగాణ బిల్లుపై శాసనసభ తన బాధ్యతను నిర్వహించిందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరగలేదని ఆయన అన్నారు. బిల్లుపై సభలో ఓటింగు ఉండదని, అఫిప్రాయాలు చెప్పడానికి మాత్రమే శాసనసభకు పంపించామని ఆయన చెప్పారు. బిజెపి తెలంగాణకు సంపూర్ణ మద్దతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తప్పకుండా పాసవుతుందనే నమ్మకం ఉందన్నారు.

సీమాంధ్రకు గానీ తెలంగాణకు గానీ చెందిన శాసనసభ్యులు తమ అభిప్రాయాలు చెప్పడానికి తాము అడ్డు పడలేదని ఆయన చెప్పారు. శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానం రాష్ట్ర విభజనపై ఏ విధమైన ప్రభావం చూపదని ఆయన అన్నారు.
రాజ్యాంగ అవసరం దృష్ట్యానే బిల్లును శాసనసభకు పంపించినట్లు ఆయన తెలిపారు. మంత్రి వర్గ సమావేశం తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటుకు వెళ్తుందని ఆయన చెప్పారు. బిల్లులో సవరణలపై కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే పార్టీలు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినవేనని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేది లేదని డిగ్గీ జాతీయ టీవి ఛానల్తో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో విలీనం కావాలని అభిప్రాయపడ్డారు. తాము రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను ప్రకటించలేదన్నారు.












Click it and Unblock the Notifications