సీఎం మీద పగ తీర్చుకుంటాం: గవర్నర్ ను కలిసిన దినకరన్: మమ్మల్నే మోసం చేస్తారా !
చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, త్వరలోనే కూలిపోతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన టీటీవీ దినకరన్ అన్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు లేదని దినకరన్ చెప్పారు.
గురువారం మద్యాహ్నం తన మద్దతుదారులైన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిశారు. గవర్నర్ తో చర్చలు జరిపిన తరువాత టీటీవీ దినకరన్ రాజ్ భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
ఎడప్పాడి పళనిసామికి శాసన సభలో బలపరీక్ష నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కు మనవి చేశామని టీటీవీ దినకరన్ అన్నారు. తమిళనాడు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ సరైన నిర్ణయం తీసుకుంటారని దినకరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి ప్రయత్నిస్తున్నారని దినకరన్ ఆరోపించారు. శశికళ ఎంతగానో నమ్మి ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు మాకే ఎదురుతిరుగుతున్నారని, ఆ దేవుడు కూడా ఆయన్ను క్షమించడని టీటీవీ దినకరన్ మండిపడ్డాడు. టీటీవీ దినకరన్ వెంట అన్నాడీఎంకే మిత్రపక్షం ఎమ్మెల్యే, నటుడు కరుణాస్ కూడా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలవడం కొసమెరుపు.