గవర్నర్ రేసులో దినేశ్వర్ శర్మ, కాగ్ రాజీవ్ మెహర్షి
ఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్కు కొత్త గవర్నర్ రానున్నారా...? ఇప్పటికే ఆ దిశగా కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ వోరా పదవీకాలం ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో కొత్త పేర్లను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే జమ్ము కశ్మీర్ మేధావి దినేశ్వర్ శర్మ, కాగ్ రాజీవ్ మెహర్షి పేర్లను గవర్నర్ పోస్టుకు కేంద్ర పరిశీలిస్తోంది.
వీరిపేర్లే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరి పేర్లతో పాటు రిటైర్డ్ డీజీ మరియు గవర్నర్ వోరా సలహాదారుడు కే.విజయ్ కుమార్ , ఐబీ ఛీప్ , రిటైర్డ్ ఆర్మీ జనరల్ పేర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా పేర్లే పరిశీలన కోసం ప్రధాని కార్యాలయానికి పంపినట్లు సమాచారం.
ప్రస్తుతం అమరనాథ్ యాత్ర కొనసాగుతున్నందున భద్రత కారణాల రీత్యా గవర్నర్ వోరా పదవీకాలం మరికొన్నిరోజులు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో కశ్మీర్ను బాగా హ్యాండిల్ చేసిన వారికోసం కేంద్రం స్టడీ చేస్తోందని హోంమంత్రి కార్యాలయం తెలిపింది.

గవర్నర్ పోస్టుపై దినేశ్వర్ శర్మ స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు గవర్నర్ పోస్టుకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని కాగ్ పదవి చేపట్టడంలో తనకు సంతోషంగా ఉందని రాజీవ్ మెహర్షి అన్నారు. అదేసమయంలో గవర్నర్ పదవి అప్పగిస్తే స్వీకరిస్తానని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా గవర్నర్ పదవి రాజీవ్ చేపడతారనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చినా... చివరకు వోరా ఆ పదవిని చేపట్టారు.
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం జూన్లో పడిపోయిన తర్వాత వోరా పదవీకాలం ఈనెల 26వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కశ్మీర్ లో స్థానిక ఎన్నికలు అక్టోబర్లో జరగాల్సి ఉన్నందున ఎంత త్వరగా గవర్నర్ను మారిస్తే అంత మంచిదని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సున్నితంగా ఉండే దక్షిణ, సెంట్రల్ కశ్మీర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో కొత్తగా వచ్చే గవర్నర్ ఆ సవాలును స్వీకరించేందుకు కొంత సమయం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడుతోంది.












Click it and Unblock the Notifications