డిన్నర్ విత్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ క్రేజీ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
ప్రభుత్వ టీచర్లపై వ్యతిరేకత మొదలు: లేటుగా వచ్చారని గేటుకు తాళం వేసిన పేరెంట్స్: గుంటూరులో
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తంగా 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం ఎన్నికల అధికారులు 1,74,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతుంది.
పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది ఆప్. తాము అధికారంలోకి వస్తే సంగ్రూలి ఎంపీ భగవంత్ మాన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గోవాలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి జోరును కొనసాగిస్తోందీ పార్టీ.
తాజాగా- వినూత్న తరహా ప్రచార కార్యక్రమానికి తెర తీసింది. ఏక్ మౌకా ఆప్ కో(ఆప్కు ఒక అవకాశం) పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ను చేపట్టింది. దీన్ని కేజ్రీవాల్కు ప్రారంభించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రచారం చేయాలని ఆయన ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మొహల్లా క్లినిక్స్, ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలపై అయిదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా, తమ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా సోషల్ మీడియాలో విస్తతంగా ప్రచారం చేయాలని కోరారు.
వైరల్గా మారిన వీడియోల్లో 50 మందిని ఎంపిక చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల అనంతరం వారిని అరవింద్ కేజ్రీవాల్తో డిన్నర్కి ఆహ్వానిస్తామని చెప్పారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వీడియోలతో పాటు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వివరాలను యూట్యూబ్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో వైరల్ చేయాలని అన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వాట్సప్ వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ చేయాలని అన్నారు.