తీర్పు సంతృప్తిగా లేదు, కానీ అంగీకరిస్తున్నాం: శబరిమల పూజారీ, స్వాగతించిన జయమాల
శబరిమల: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తికి గురి చేసిందని, కానీ అంగీకరిస్తున్నామని శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు కందరారు రాజీవరూ అన్నారు.
అన్ని వయస్సులలోని మహిళలకు శబరిమలలో ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేదని చెప్పారు. అయితే తీర్పును తాము అంగీకరిస్తున్నామని చెప్పారు.

కోర్టు తీర్పు పైన ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ కూడా స్పందించారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను కొనసాగిస్తేనే మంచిదని ట్రావెన్కోర్ బోర్డు... కోర్టుకు చెప్పిందని అన్నారు.
అయితే ఇప్పుడు తమకు మరో అవకాశం లేదని, కోర్టు తీర్పును అమలు చేస్తామని అన్నారు. అయ్యప్ప ధర్మ సేన అధ్యక్షులు రాహుల్ ఈశ్వర్ మాట్లాడుతూ తీర్పుపై రివ్యూ పిటిషన్కు వెళ్తామన్నారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కూడా రివ్యూ పిటిషన్ ఆలోచన చేస్తోంది.
మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించడం సరికాదని, శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.
తీర్పును స్వాగతించిన జయమాల
సుప్రీం కోర్టు తీర్పును కర్ణాటకకు చెందిన వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ జయమాల స్వాగతించారు. రాజ్యాంగంలో మహిళలకు, పురుషులకు బేధం చూపించరని అన్నారు. ఇక్కడ ఆలయాలు కేవలం పురుషులకే, కేవలం మహిళలకే అని పేర్కొనడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications