గాంధీజీ హత్య కేసు: గాడ్సే చెప్పిందేంటి? వెబ్ సైట్ లో పెట్టమన్న సిఐసి
గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది.
న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఏఐ)ను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది.
ఆ వివరాలన్నింటినీ ఎన్ఏఐ వెబ్ సైట్ లో పొందుపరచాలని కూడా సీఐసీ సూచించింది. గాంధీజీ హత్య కేసులో చర్జ్ షీట్, వాంగ్మూలాన్ని వెల్లడించాలని అశుతోష్ బన్సాల్ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును వారు ఎన్ఐఏకి బదిలీ చేశారు.
అయితే, ఆ వివరాలను తమ వెబ్ సైట్ లో శోధించి కావలసిన సమాచారాన్ని పొందాలని దరఖాస్తుదారుడికి ఎన్ఏఐ సూచించింది. దీంతో సమాచారహక్కు చట్టం ద్వారా అవసరమైన సమాచారం తనకు రాలేదని ఆరోపిస్తూ అశుతోష్ బన్సాల్ సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులును ఆశ్రయించాడు.
దీంతో ఆయన స్పందించి దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని రికార్డ్స్ లో ఇండెక్స్ తో సహా అందించాలని, దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ.2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లో గాంధీ హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్ పత్రాలను, నాథురామ్ గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు.